
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు.