బాలుడిపై లైంగిక దాడి.. 24 కత్తిపోట్లు  | Delhi Teen Brutally Killed By Gang In Revenge Attacks, More Details Inside | Sakshi
Sakshi News home page

బాలుడిపై లైంగిక దాడి.. 24 కత్తిపోట్లు 

Jul 26 2025 6:43 AM | Updated on Jul 26 2025 10:21 AM

Delhi Teen Brutally Killed by Gang in Revenge Attacks

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం 

ప్రత్యర్ధికి ఇన్ఫార్మర్‌గా వ్యవహరించాడని అనుమానం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ప్రత్యర్థి గ్యాంగ్‌కు సమాచారమిచ్చాడనే కక్షతో 14 ఏళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణంలో పాలుపంచుకున్న 13 మందిలో అత్యధికులు మైనర్లే కావడం గమనార్హం. అంతా కలిసి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి, హింసించి ప్రాణాలు తీశారు. అతడి శరీరంపై మొత్తం 24 కత్తిపోట్లున్నాయి. మర్మాయవాలను తీవ్రంగా గాయపరిచారు. 

జూన్‌ 29–30వ తేదీల్లో ఈ ఘటన చోటుచేసుకోగా బాలుడి మృతదేహం జూలై ఒకటో తేదీన ఢిల్లీలో మునాక్‌ కాలువ ఒడ్డును నగ్నంగా పడి ఉండగా గుర్తించారు. మొత్తం పది మంది ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చిన పోలీసులు 19 ఏళ్ల కృష్ణ అలియాస్‌ భోలాను ప్రధాన నిందితుడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కావడ్‌ యాత్రికులుగా వేషం వేసుకున్న ముగ్గురిని యూపీలోని మీరట్‌లో కన్వర్‌ క్యాంపులో ఉండగా గుర్తించారు. 

ఈ నెల 18న పోలీసులు సైతం కన్వరియాలుగా వేషం వేసుకుని వెళ్లి వారిని మోనుతోపాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడైన భోలాపై గతేడాది ప్రత్యర్థి బధ్వార్‌ సోదరులు మోను, సోనులు దాడి చేశారు. అక్రమ మద్యం విక్రయాలు, చోరీల ఆరోపణలపై పోలీసులు మోకా చట్టం కింద మోను, సోనులను జైలులో పెట్టారు. 

ఈ సోదరులకు తనను గురించిన సమాచారం అందిస్తున్నట్లు అనుమానం పెంచుకున్న భోలా.. ఆ బాలుడిని చంపేందుకు కుట్ర పన్నాడు. జూన్‌ 29వ తేదీ రాత్రి బాలుడిని వీర్‌ చౌక్‌ వద్ద ఉండగా పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అనంతరం బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని మునాక్‌ కాల్వ వద్దకు తీసుకెళ్లారు. లైంగిక దాడికి పాల్పడటంతోపాటు వెంట తెచ్చుకున్న కత్తితో ఒకరి తర్వాత ఒకరు అతడిని పొడిచి, వదిలేసి పరారయ్యారు. గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. 

ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. మెడకు కేవలం స్కార్ఫ్‌ మాత్రం కట్టి ఉంది. ఆధారాల ప్రకారం దర్యాప్తు చేపట్టి భోలాను పట్టుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో అత్యధికులు మైనర్లే అయినప్పటికీ అత్యంత తీవ్రమైన నేరమైనందున మేజర్లుగా 16ఏళ్లు దాటిన వారిగా గుర్తించి, తీవ్ర శిక్షలు వేయాలని కోర్టును కోరుతామని డీసీపీ హరేశ్వర్‌ స్వామి తెలిపారు. నిందితులపై హత్య, సాక్ష్యాధారాల తారుమారుతోపాటు పోక్సో కేసు కూడా నమోదు చేశామన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement