సీబీఎస్‌ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త! | CBSE Row: Rahul Gandhi Sensational Allegations Details Here | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త!

Jun 1 2026 12:25 PM | Updated on Jun 1 2026 7:47 PM

CBSE Row: Rahul Gandhi Sensational Allegations Details Here

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్న ఆన్సర్ షీట్ స్కానింగ్, రీవ్యాల్యుయేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవడానికి కూడా విద్యార్థుల నుంచే డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా ఎక్స్‌లో చేసిన పోస్టులో రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జేబుదొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు CBSEలోనే కూర్చున్నారు. బోర్డు తప్పు వల్ల మీ మార్కులు తప్పుగా నమోదైతే మీకు ఏమి దక్కుతుంది? ఒక బిల్లు మాత్రమే. డిజిటల్ స్కాన్డ్ కాపీకి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ-టోటలింగ్‌కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్‌కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చెల్లించాలి” అంటూ మండిపడ్డారు.

సీబీఎస్‌ఈ పరీక్షల ఆన్సర్ షీట్ల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల మార్కులు తప్పుగా అప్‌లోడ్ అవుతున్నాయని, వాటిని సరిచేయాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.

“తప్పు సీబీఎస్‌ఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం ప్రభుత్వానికి” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తే తప్పులు సరిదిద్దబడవని, మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టం చవిచూస్తున్నది పిల్లలేనని, వారి సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల పేజీలు మిస్ కావడం, బ్లర్ కాపీలు రావడం, సమాధాన పత్రాలు పూర్తిగా అప్‌లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.

ఎవరీ సార్ధక్‌ సిద్ధాంత్‌..
ఈ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ షేర్ చేసిన పోస్ట్‌లో ఉన్న అంశాలను బయటపెట్టిన వ్యక్తి జార్ఖండ్‌కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్. సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలను పరిశీలించిన ఆ 17 ఏళ్ల కుర్రాడు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ నిబంధనలను మూడు దశల్లో సడలించినట్లు ఆధారాలతో వెల్లడించాడు. ఈ మార్పులు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్‌ ఎడుటెక్ సంస్థకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.

సార్థక్ సిద్ధాంత్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2025 మేలో విడుదల చేసిన టెండర్‌లో ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో, కనీసం 300 DPI నాణ్యతతో స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అయితే అదే టెండర్‌ను ఆగస్టులో మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ నిబంధనలను సడలించి, స్కానర్ల ప్రస్తావనను సాధారణీకరించడంతో పాటు రిజల్యూషన్‌ను 200 DPIకు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు బయటపడిందని, దీనివల్లే బ్లర్ కాపీలు, మిస్సింగ్ పేజీలు, స్కాన్ కాని సమాధాన పత్రాల సమస్యలు వచ్చాయని ఆరోపించారు.

ఇక రాహుల్ గాంధీ కోఎంప్ట్‌ ఎడుటెక్ సంస్థపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ఈ సంస్థ మరో పేరుతో వివాదాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సమాధాన పత్రాల గందరగోళానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని సీబీఎస్‌ఈ చెబుతోంది. ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ కాన్పూర్‌లకు చెందిన నిపుణులతో పాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వ్యవస్థను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.

మొత్తంగా, లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యా మూల్యాంకన వ్యవస్థ పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు, రీవ్యాల్యుయేషన్ ఫీజులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement