కారుతో ఢీకొట్టడమే కాకుండా పోలీసులకే కట్టుకథ

Businessman Hits Cyclist With SUV And Ties To Fool Police After Death - Sakshi

ఢిల్లీ : కారుతో గుద్ది ఒక వ్యక్తిని చంపడమే గాక స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకే కట్టుకథ చెప్పిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. ఢిల్లీకి చెందిన సోనిత్‌ జైన్‌ అనే వ్యాపారవేత్త సెప్టెంబర్‌ 8న తన ఎస్‌యూవీ రేంజ్‌రోవర్‌ కారులో పని ముగించుకొని గ్రేటర్‌ కైలాష్‌ పార్ట్‌ 1లో ఇంటికి బయలుదేరాడు. బదార్‌పూర్‌లోని అలీ విహార్‌ మార్గ్‌కు రాగానే ఎదురుగా సైకిల్‌పై వస్తున్న సంజేష్‌ అవాస్తీ అనే వ్యక్తిని గుద్దాడు. సంజేష్‌ అవాస్తీని ఆసుపత్రిలో చేర్పించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు కట్టుకథ చెప్పాడు. తాను ఇంటికి వచ్చే మార్గంలో ఓక్లామండి వద్దకు రాగానే సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి సృహతప్పి కిందపడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయం తగిలి అపస్మారకస్థితికి వెళ్లాడని..అతన్నిఆసుపత్రిలో చేర్చి వచ్చినట్లు తెలిపాడు. (చదవండి : హృదయ విదారకం.. పెళ్లయిన 15 రోజులకే)

అయితే అసలు విషయానికి వస్తే.. సంజేష్‌ అవాస్తీ పనికి వెళ్లేందుకుకని ఫరీదాబాద్‌లోని తన ఇంటి నుంచి సైకిల్‌పై బయలుదేరాడు. అదే దారిలో గ్రేటర్‌ కైలాష్‌ మార్గ్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఎస్‌యూవీ కారులో సోనిత్‌ జైన్‌ వేగంగా వస్తున్నాడు. బదార్‌పూర్‌ వద్దకు రాగానే సంజేష్‌ ఉన్న సైకిల్‌ను వెనుక నుంచి బలంగా గుద్దడంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. అయితే పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే అనుమానం వస్తుందేమోనని మూల్‌ చంద్‌ ఆసుపత్రికి తరలించి ఆసుపత్రి సిబ్బందికి ఓక్లా మండి రోడ్డు మీద సృహ లేకుండా పడి ఉన్నాడని, తీవ్ర గాయాలయ్యాయని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. సోనిత్‌ వెళ్లిన కాసేపటికే సంజేష్‌ మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం అమర్‌ కాలనీ పోలీసులకు ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పారు.

వారి ఫిర్యాదు ఆధారంగా ట్రేస్‌ చేసి చూడగా ఒక్లా మండి సెంటర్‌ వద్ద ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదని పోలీసులు కనుగొన్నారు. ఇదే సమయంలో సంజేష్‌ బంధువులు బదార్‌పూర్‌ ఫ్లైఓవర్‌ వద్ద రక్తంతో తడిసిన బ్యాగ్‌, సైకిల్‌ పడి ఉన్నాయి. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు సంజేష్‌ బందువులు, ఆసుపత్రి సిబ్బంది  చెప్పిన చనిపోయిన వ్యక్తి గుర్తులు ఒకేలా ఉన్నాయని గుర్తించారు. దీంతో సోనిత్‌ తనను తాను రక్షించుకోవడానికి కట్టుకథ అల్లినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం సోనిత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top