తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసాకి కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా జరిపిన దాడిలో భారత నావికుల మృతి పట్ల కేంద్రాన్ని కాంగ్రెస్ ఎండగడుతున్న తరుణంలో మోదీకి థరూర్ మద్దతుగా మాట్లాడారు. ఇటీవల జరిగిన జీ7 సమ్మిట్లో భారత్ సమస్యను తగిన రీతిలో మోదీ తెలియజేశారన్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రతిపక్ష బీజేపీ విధానాలకు పలుమార్లు మద్ధతిస్తూ సొంత పార్టీని తరచుగా ఇబ్బందులకు గురిచేస్తారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను మరోసారి ఇరకాటంలో పడేశాయి. ఇటీవల హర్ముజ్ జలసంధి ఒమన్ తీరంలో అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించారు. ఈ అంశంలో కేంద్రం తగిన విధంగా స్పందించడం లేదని కాంగ్రెస్ ఎండగడుతుంది. ఇటీవల జరిగిన జీ-7 సమ్మిట్లోనూ ప్రధాని ఈ విషయంపై ట్రంప్తో తగిన విధంగా స్పందించలేదని మౌనంగా ఉన్నారని విమర్శలు గుప్పించింది.
అయితే కాంగ్రెస్ ప్రధానిని ఎండగట్టే యత్నం చేస్తుంటే.. ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ మాత్రం మోదీని ప్రశంసిస్తూ మాట్లాడారు. "ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షునితో జరిగిన బహిరంగ, ప్రైవేట్ సమావేశాల్లోనూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో వాణిజ్య నౌకల్లోని పౌర నావికులు పోరాటానికి లక్ష్యం కాకూడదనే సందేశాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం. వారు సైనికులు కాదు,ఒకవేళ వారు అమెరికా నౌకదళ దిగ్భందనాన్ని ఉల్లంఘిస్తుంటే వారిని మరో పద్ధతిలో నిరోధించండి కానీ చంపడం మార్గం కాదు ప్రధాని మోదీ తెలియజేసిన సందేశం ఇదే," అని థరూర్ అన్నారు.
అయితే ఒమన్ తీరంలో నావికుల మృతిపై మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న సమయంలో థరూర్ వాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శశిథరూర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ కౌంటర్ మెుదలు పెట్టింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ "కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బండారం బయటపెట్టారు. కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీజీ దౌత్యనీతిని బహిరంగంగా ప్రశంసిస్తున్నారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధాని మోదీకే మొదటి స్థానం "అని అన్నారు.


