
మనమిప్పుడు ‘కార్యాచరణ దశాబ్దం’లోకి ప్రవేశించి ఉన్నాం. 2030 నాటికి సుస్థిరమైన అభివృద్ధిని సాధించి, ఈ భూమండలాన్ని మానవ జీవనానికి మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడం మన ముందున్న లక్ష్యం. లింగ సమానత్వం; మహిళలు, బాలికల సాధికారత అనేవి కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగమైనవే. అదే సమయంలో.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంక్షోభ నిర్వహణ, సామాజిక అభివృద్ధి, సమాజంలోని బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం.. వీటన్నిటితో కూడిన ‘సుస్థిర భవిష్యత్తు’ అనే లక్ష్యాన్ని మహిళల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యం చేసుకోగలమని మనం గ్రహించాలి.
నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. రాణించాలనే పట్టుదల అమ్మాయిలలో బలంగా ఉంటోంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 6–12 తేదీల మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2,614 మంది స్వయం సహాయక బృందాల మహిళా వ్యాపారులకు కేవలం వారం వ్యవధిలోనే 8 కోట్ల 60 లక్షల రూపాయల రుణాలను ‘కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ ఫండ్’ లోన్ కింద అందించింది.
స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు తమను తాము శక్తిమంతం చేసుకోవడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థకూ నిలకడైన స్థిరత్వాన్ని చేకూర్చుతున్నారు. నేడు దేశవ్యాప్తంగా 70 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, స్త్రీల శక్తి సామర్థ్యాలు దేశాన్ని గొప్ప శిఖరాలకు తీసుకువెళతాయని, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారతీయ మహిళలు భారత్ని మహోన్నత రాజ్యంగా అవతరింపజేయగలరని!