
279 మంది ప్రాణాలు బలిగొన్న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న విమానపు బ్లాక్బాక్స్(Air India Black Box) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో డాటా సేకరణ కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్క్లూజివ్గా కథనం ప్రచురించింది.
జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పుడు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కేంద్రం గురువారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దానిని టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్బాక్స్ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే..
డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్బాక్స్గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్లు 25 గంటలపాటు కాక్పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు.
ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్బాక్స్లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).
AAIB ముందు ఆప్షన్లు ఇవే
లక్నోలోని హాల్(HAL) సెంటర్కు పంపడం
అమెరికాలోని ఎన్టీఎస్బీకి (National Transportation Safety Board) జాతీయ రవాణా భద్రతా సంస్థకి పంపడం
యూకే లేదంటే సింగపూర్లోని సివిల్ ఏవియేషన్ అథారిటీకి పంపడం
బ్లాక్బాక్స్లో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిందని.. ఇక్కడ దానిని రికవరీ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చని ఏఏఐబీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ డాటా రికవరీ కోసం దానిని అమెరికాకే పంపించే యోచనలో ఏఏఐబీ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.
ఇదీ చదవండి👉: దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్బాక్స్ ట్విస్ట్!