‘171’ నంబర్‌కు బైబై.. నంబర్లు మార్చేసిన ఎయిర్‌ ఇండియా | Air India Changes AI-171 to become AI-159 | Sakshi
Sakshi News home page

‘171’ నంబర్‌కు బైబై.. నంబర్లు మార్చేసిన ఎయిర్‌ ఇండియా

Jun 15 2025 7:19 AM | Updated on Jun 15 2025 10:54 AM

Air India Changes AI-171 to become AI-159

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ‘ఏఐ171’అనే నంబర్‌ కలిగిన బోయింగ్‌ 787–8 విమానం కూలిపోవడం, 270 మంది మరణించడంతో ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ విమానాలకు ఏఐ171, ఐఎక్స్‌ 171 పేర్లను తొలగించాయి.

ఇక, అహ్మదాబాద్‌–లండన్‌ మధ్య నడిచే విమానాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి ‘ఏఐ159’ అనే కొత్త నంబర్‌తో పిలువనున్నట్లు ఎయిర్‌ ఇండియా వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు టికెట్ల బుకింగ్‌ వ్యవస్థలో శుక్రవారం నుంచే మార్పులు చేసినట్లు తెలిపాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సైతం తమ విమానానికి ‘ఐఎక్స్‌171’నంబర్‌ను వదులుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త నంబర్‌ను ఇంకా ప్రకటించలేదు. ప్రమాదానికి గురైన విమానం నంబర్‌ను మార్చడం కొత్తేమీ కాదు. ప్రమాదంలో మరణించినవారికి నివాళిగా పాత నంబర్‌ను వదిలేసుకోవడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది.    

ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్‌ ప్రమాదానికి గురైన విమానంలోని ఎయిర్‌ ఇండియా పైలట్‌ చివరి మాటలు బయటకు వచ్చాయి. విమానం పైకి ఎగరడం లేదు. కిందికి పడిపోతోంది. ఇప్పుడు కమ్యూనికేషన్‌ లైన్‌ బలహీనంగా ఉంది. మేడే అని.. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ)కు పైలట్‌ చివరి సందేశం చేరవేశాడు. ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోందని ఈ సందేశాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఏఐ171 విమానం కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement