
ముంబై: మూడేళ్ల చిన్నారి వియానా. ఐటీలో పనిచేసే పీయూష్, వర్షా జైన్ దంపతుల ఒక్కగానొక్క కూతురు. మాటలు కూడా పూర్తిగా రాని చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు గత జనవరిలో నిర్ధారణ అయ్యింది. ముంబైలో ఆపరేషన్ చేయించినా లాభం లేకపోయింది. రోజురోజుకూ పరిస్థితి విషమించడంతో జైన మతస్తులైన వారు ఇండోర్లోని తమ మత గురువు రాజేష్ ముని మహరాజ్ దగ్గరకు వెళ్లారు. చిన్నారిని ‘సంతారా/సల్లేఖన’ (ఆమరణ నిరాహార దీక్ష) చేయించాలని సూచించగా అగీకరించారు. అయితే ఆ దీక్ష తీసుకున్న పది నిమిషాల్లోనే చిన్నారి మరణించింది. అతి పిన్న వయసులో ‘సల్లేఖన దీక్ష’ స్వీకరించిన వ్యక్తిగా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో వియానా పేరు నమోదవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఏమిటీ దీక్ష?
సంతారా లేదా సల్లేఖనం అంటే స్వచ్ఛందంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే జైన ఆచారం. అలా శరీరాన్ని కృశింపజేసుకుంటూ మరణాన్ని ఆహా్వనించడం. సాధారణంగా వృద్ధులు ఈ దీక్ష తీసుకుంటారు. మూడేళ్ల చిన్నారికి అలాంటి దీక్ష ఇవ్వడం చర్చనీయంగా మారింది. జీవించే హక్కును కాలరాస్తూ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. తల్లిదండ్రుల వాదన వేరేలా ఉంది. ‘‘కూతురు చనిపోవాలని ఏ తల్లీ కోరుకోదు.
నా బిడ్డతో సంతార ప్రతిజ్ఞ చేయించడానికి ఎంత బాధపడ్డానో చెప్పలేను! ట్యూమర్తో తను విలవిల్లాడుతోంది. ఆ స్థితిలో చూడలేకే అంగీకరించాం’’ అని వర్ష తెలిపింది. ‘‘నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడ్డ స్థితిలో పాపకు చివరి క్షణాలు సమీపించాయి గనుక మా గురువు సలహా మేరకు సంతారకు అంగీకరించాం’’ అని పీయూష్ చెప్పారు. కానీ అలాంటి నిర్ణయం తీసుకునే హక్కు తల్లిదండ్రులకు లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ‘‘మత స్వేచ్ఛ నమ్మకానికి సంబంధించింది మాత్రమే. ప్రాణాలు తీసే ఆచారాలను పాటించడానికి కాదు’’ అన్నది వారి వాదన.
సల్లేఖనం నేరమన్న హైకోర్టు
సంతారా/సల్లేఖన దీక్ష నేరమని 2015లో రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. ఈ ఆచారాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆత్మాహత్యాయత్నంగా పరిగణించి శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది. ఇది న్యాయ, జైన మత వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తీర్పును జైన సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.