కొత్తపల్లి: ఎరువుల ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ లేక రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని భూనీడులో బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఒకరోజు రైతు నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నదాతలు వ్యవసాయం పండుగలా చేసుకొనేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు ఒక్కో బస్తాపై రూ.750 నుంచి రూ.900 వరకు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఊకదంపుడు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రైతులకు సకాలంలో సన్నరకం వరికి బోనస్, పెట్టుబడి సాయం అందించడం లేదన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు అభివృద్ధి పేరుతో కమీషన్లు దండుకొని సొంత ఆస్తులను పెంచుకొంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి మద్దూరు మండలంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్పార్టీకి చెందిన వ్యక్తులు కమీషన్లు తీసుకొని మంజూరు చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా రైతుభరోసా, బోనస్ సకాలంలో విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఎరువులపై పెంచిన ధరలు తగ్గించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక వదిలిపెట్టేది లేదని.. అవసరమైతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్రెడ్డి, వంచర్ల గోపాల్, కౌన్సిలర్లు దినేష్కుమార్, నర్సింహులు, శివకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు మహిపాల్, చికిని అంజయ్య, విఠల్, రాజురెడ్డి, రాంరెడ్డి, శివారెడ్డి, వెంకటేష్, ఎంపీటీసీ మాజీ సభ్యులు రాజు, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


