
వానాకాలం గట్టెక్కేదెలా?
మరికల్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చిన్నపాటి వర్షాలకే రహదారులు చిత్తడవుతున్నాయి. వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోతోంది. ఇళ్లలో సేకరించిన చెత్త తరలింపులో జాప్యం జరుగుతోంది. డీజిల్ కొరతతో పంచాయతీ ట్రాక్టర్లు కదలడం లేదు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీల్లో నిధుల లేమితో బ్లీచింగ్ పౌడర్, వీధి దీపాల ఏర్పాటు, డీజిల్, ఇతర అవసరాలు తీర్చడం భారంగా మారింది. తప్పని పరిస్థితుల్లో సొంత డబ్బులు వెచ్చిస్తున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగక పోవడంతో పల్లెల్లో సర్పంచులు లేరు. పంచాయతీ సాధారణ నిధులు ఖర్చు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో వర్షాకాలంలో పారిశుద్ధ్య పనులు ఎలా చేయాలనే విషయమై సందిగ్ధం నెలకొంది.
నిధులు కేటాయిస్తేనే..
గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. అపరిశుభ్రత వాతావరణం కారణంగా డెంగీ, మలేరియా, చికున్గున్యా, ఇతర వ్యాధు లు వ్యాప్తిచెందే అవకాశం లేకపోలేదు. మరోవైపు తాగునీటి పైపులైన్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తోంది. పైప్లైన్లు మరమ్మతుకు నోచుకోకపోవడంతో తాగునీరు కలుషితమవుతోంది. పంచాయతీల్లో నిధుల లేమి నెలకొన్న తరుణంలో వానాకాలం గండం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని దుస్థి తి నెలకొంది. గతంలో పంచాయతీలకు ప్రతినెలా రూ. 7.50 కోట్ల ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. ఏడాదికి పైగా పాలకవర్గాలు లేకపోవడంతో ఈ నిధులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా నిధు లు కేటాయిస్తేనే సమస్యలు తొలగినున్నాయి.
పంచాయతీల్లో పారిశుద్ధ్య
నిర్వహణకు నిధుల కొరత
బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకూ
దిక్కులు చూడాల్సిందే..
మూలనపడిన ట్రాక్లర్లు
పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు