
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్రెడ్డి అన్నారు. పట్టణంలోని గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ ఫలితాలను సాధించామని, అందుకు కలెక్టర్, విద్యాశాఖ అధికారుల చక్కటి ప్రణాళిక, ఉపాధ్యాయుల కృషి అభినందనీయం అన్నారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో టాపర్గా నిలిచిన ఇద్దరు విద్యార్థులు, ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లకు సన్మానం చేసేందుకు సంఘం నిర్ణయించిందని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్థానిక అంజనా గార్డెన్ లో జరిగే ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఈఓ గోవిందరాజు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డి హాజరు కానున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు వాణిశ్రీ, రఘువీర్ పాల్గొన్నారు.
కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం
నారాయణపేట: కార్మిక హక్కుల పరిరక్షణకు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) నిరంతర పోరాడుతుందని రాష్ట్ర కార్యదర్శి కె సూర్యం ప్రకటించారు. ఆది, సోమవారాల్లో జిల్లా కేంద్రంలో టీయూసీఐ మహాసభలు జరగగా.. ఈమేరకు జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందని ఆయన మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కిరణ్, బోయిన్పల్లి రాము మాట్లాడుతూ కార్మిక రంగంలో టీయూసీఐ బలంగా పనిచేస్తుందన్నారు. ఈ జిల్లాలో కార్మిక రంగంలో పద్నాలుగు రంగాల్లో నిర్మాణం కలిగి ఉందని, నిరంతరం కార్మికుల సంక్షేమం కోరుతూ వారి హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడుతుందన్నారు. ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దుచేయాలనీ డిమాండ్ చేశారు. అందుకోసం కార్మికులను నిత్య చైతన్యం చేస్తూ పోరాటాల్లోకి నడిపిస్తామని అన్నారు. ఇక కార్యవర్గం విషయానికి వస్తే.. ఉపాధ్యక్షులుగా బి.నర్సింహ, ఏజి. బుట్టో, కె. కాశీనాథ్, సహాయ కార్యదర్శులుగా నర్సింహ, రామాంజనేయులు, శుశాంత్ తదితరులను ఎన్నుకున్నారు.
పెద్దధన్వాడ రైతులకు బెయిల్ మంజూరు
గద్వాల క్రైం: జోగుళాంబ జిల్లాలోని రాజోళి మండలం పెద్ద ధన్వాడకు చెందిన 12 మంది రైతులకు జిల్లా న్యాయమూర్తి ప్రేమలత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అమయాక రైతులపై ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులచే అక్రమ కేసులు నమోదు చేశారని జిల్లా కోర్టులో మంగళవారం న్యాయవాదులు మదన్మోహన్రెడ్డి, శోభారాణి వాదనలు వినిపించారు. ఈ నెల 4న రాజోళి మండలం పెద్దధన్వాడ గ్రామంలో గాయత్రి రెన్యూవబుల్ ఆన్లైన్ ఇండస్ట్రిస్ కంపెనీ యాజమాన్యం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, దాదాపు 11 గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు. పంటల సాగుకు అనుకూలమైన భూములలో రైతులు ఏళ్లతరబడిగా వ్యవసాయం చేసి ఊపాధి పొందుతున్నారని వివరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి కోల్పోవడంతోపాటు కాలుష్య వాతవారణంతో జన జీవనం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రైవేటు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని రైతులపై ప్రతిఘటించారని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అల్లర్లు చోటు చేసుకున్నాయని వివరించారు. దీంతో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా 42 మంది రైతులపై రాజోళి పోలీసుస్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేయించారన్నారు. ఈ నెల 5న గద్వాల జూనియర్ సివిల్ జడ్జి ముందు పోలీసులు 12 మంది రైతులను హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్కు ఆదేశించడంతో పోలీసులు జైలుకు తరలించారన్నారు. రైతులపై ఫ్యాక్టరీ యాజమాన్యం, సీఈఓ మంజునాథ్ ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయించారని వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి ప్రేమలత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు ‘సాక్షి’కి చెప్పారు.