
రుచికరమైన భోజనం అందించాలి
నారాయణపేట: పాఠశాలలు, వసతిగృహాల ఆహారం తయారీలో నాణ్యత, శుభ్రత పాటించాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం వీసీ హాల్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు వండే ఆహారం విషయంలో వంట సిబ్బందికి పరిశుభ్రత పాటించాలని, తాజా ఆకుకూరలు, ఆహార పదార్థాల్లో నాణ్యత తప్పనిసరి అని అన్నారు. యాక్షన్ ప్లాన్తో తగు చర్యలు తీసుకోవాలని డీఈఓకు సూచించారు. పిల్లలు సైతం శుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని, విధిగా వసతి గృహాలను పర్యవేక్షించి రాత్రి బస చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతిగృహాలను గ్రామ పంచాయతీ అధికారులు తనిఖీ చేసి క్లీన్ అండ్ గ్రీన్ చేయాలన్నారు. అలాగే, 300 కంప్యూటర్లు అన్ని స్కూళ్లలో అందుబాటులో ఉండాలని డీఈఓ ని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతంపై 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ రామచందర్, జెడ్పీ సీఈఓ శైలేష్, డీఈఓ గోవిందరాజులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
భూభారతి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి భూభారతిపై తహసీల్దార్లతో సమీక్షించారు. దామరగిద్ద, నారాయణపేటలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. పీఓపీ కేసులు, అసైన్డ్ కేసులు ఎన్ని వచ్చాయని అడిగారు. రెండు రోజులలో పురోగతి చూపించాలని సూచించారు. నర్వలో వచ్చిన దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. కోస్గిలో దాదాపు పూర్తి చేశామని తహసీల్దార్ వివరించారు. గుండుమాల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ఆరా తీయగా.. 149 వచ్చాయని అధికారులు సమాధానం ఇచ్చారు. కొత్తపల్లి మండలంలోని 11 గ్రామాల్లో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని, ల్యాండ్ ఆక్టివిజేషన్ తదితర వివరాలను తహసీల్దార్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఊట్కూర్లో ఎన్ని కేసులు వచ్చాయని అడగగా క్యాంపులు పూర్తి చేశామని తహసీల్దార్ తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులు తీసుకోవాలని తహసీల్దార్కు సూచించారు. కృష్ణాలో 153 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ తెలిపారు. మాగనూర్ విషయానికి వస్తే.. 20 గ్రామాలు ఉన్నాయని గ్రామాల వారీగా దరఖాస్తులను తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. మిస్సింగ్ సర్వే నంబర్, కోర్టు కేసులు నేమ్ కరెక్షన్ ఓ ఆర్సి ఫీల్డ్ వెరిఫై చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
దామరగిద్ద: ఉద్యాన కూరగాయల సాగులో రైతులను ప్రోత్సహించేందుకు జిల్లా ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని మద్దెల్బీడ్లో రైతులు శంకర్, బుగ్గప్ప సాగు చేసిన కూరగాయల పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వారితో పంటల సాగులో లాభ నష్టాలు, ప్రభుత్వం ద్వారా అందుతున్న, అందాల్సిన పోత్సాహకాలపై ఆరా తీశారు. కూరగాయల సాగు రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు చేయాలని తేనెటీగల పెంపకం మల్చింగ్, డ్రిప్, శాశ్వత పందిర్లు, ప్లాస్టిక్ ట్రేలు తదితర వాటికి కావల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని గత్ప గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.