
రైతుకు భరోసా
నారాయణపేట: వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సాగు ఖర్చుల నిమిత్తం రైతుభరోసా పథకం నిధులను సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో మొదటి రోజు 94,489 మంది ఖాతాల్లో రూ. 59.18 కోట్లు జమయ్యాయి. వానాకాలం సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత యాసంగి సీజన్లో 3.5 ఎకరాలకే రైతుభరోసా అందగా.. ప్రస్తుతం 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందనుంది. కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతుభరోసా అందించేందుకు సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో 1,78,017 మంది రైతులకు గాను రూ. 257 కోట్లు పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందించనున్నారు. ఇది వరకు ఎకరా, రెండెకరాలు, మూడెకరాలు, ఆ తర్వాత నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు దశల వారీగా నెల రోజులపాటు రైతుభరోసా జమ అయ్యేది. కానీ అలాంటి నిబంధనలు ఏమి లేకుండా రైతులందరికీ రైతుభరోసా అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 25 వరకు విడతల వారీగా..
చిన్నా, సన్నకారు రైతులకు పంటసాగు పెట్టుబడి భారం తగ్గించి.. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందిస్తున్న విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ. 10వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 12వేలు వానాకాలం, యాసంగి సీజన్లలో రూ. 6వేల చొప్పున అందిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం వానాకాలానికి సంబంధించి సోమవారం నుంచి జూన్ 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, కొత్తగా అర్హత పొందిన రైతుల పేర్లను శ్రీరైతుభరోసా’ జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వారికి ఈ నెలాఖరులోగా నిధులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
వానాకాలం సాగుకు
పెట్టుబడి సాయం
మొదటి రోజు 94,489 మందికి రూ. 59,18 కోట్లు జమ
జిల్లాలో 1,78,017 మందికి
అందనున్న రూ. 257కోట్లు
అనందంలో అన్నదాతలు

రైతుకు భరోసా