
పాలనలో కలెక్టర్ మార్క్
నారాయణపేట: గతేడాది జూన్ 16న కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్.. అన్నిరంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే.. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలుచేస్తూ సమర్థవంతమైన పాలన జిల్లా ప్రజలకు అందిస్తున్నారు. సహజ వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పాటు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ.. ఉన్నత లక్ష్యాల దిశగా అడుగులు వేసేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు కొత్త మండలాల్లో జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలను వేగిరం చేయిస్తున్నారు. జిల్లాలోని 486 ప్రభుత్వ పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్ సౌకర్యం కల్పించారు.
కలెక్టర్గా ఏడాది పూర్తి చేసుకున్న సిక్తా పట్నాయక్
సమర్థవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు
పారదర్శకంగా పథకాల అమలు
ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం