నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమా వేశ భవనంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయం,గ్రామీణ నీటి సరఫరా, పాఠశాల విద్య, విద్యుత్‌ శాఖలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, జెడ్పీటీసీ, కోఆప్షన్‌ సభ్యులు, కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యే లు, జిల్లా కలెక్టర్లు, ఎంపీపీ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన చైర్మన్లను హాజరు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ఉదయం 9 గంటలకు 1వ స్థాయీ సంఘ సమావేశాలు

జెడ్పీ సర్వసభ్య సమావేశానికంటే ముందు ఉదయం 9 గంటలకు స్థానిక మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించేందుకు జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని సీఈఓ జీవీ రమణారెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి 1వ స్థాయి సంఘ సభ్యులు, సంబంధిత అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.

మహానంది దేవస్థానానికి లాకర్‌ వితరణ

మహానంది: మహానంది దేవస్థానానికి హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్ట ర్‌ రాజశేఖర్‌ చక్రవర్తి, డాక్టర్‌ కిరణ్మయి దంపతులు మంగళవారం రూ. 2 లక్ష ల విలువైన లాకర్‌ అందించినట్లు ఆల య సూపరింటెండెంట్లు శశిధర్‌రెడ్డి, నీలకంఠేశ్వరరాజు తెలిపారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దాతలు సేఫ్‌ లాకర్‌ను అందించినట్లు చెప్పారు. దేవస్థానానికి చెందిన ఆభరణాలు, విలువైన వస్తువులను భద్రపరచుకునేందుకు లాకర్‌ ఉపయోగపడుతుందన్నారు. రూ. 2 లక్షల విలువైన లాకర్‌ అందించిన దాతలకు శ్రీ మహానందీశ్వరస్వా మి వారి ప్రసాదాలు అందించి సన్మానించారు.

ఇంధన నిక్షేపాల కోసం అన్వేషణ

జూపాడుబంగ్లా: మండ్లెం రెవెన్యూ పరిధిలోని పొలాల్లో ఓఎన్‌జీసీ అధికారులు మంగళవారం గ్యాస్‌, పెట్రోలియం నిక్షేపాల కోసం అన్వేషణ ప్రారంభించారు. సుమారు ఏడేళ్ల క్రితం మిని విమానంతో నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని జూపాడుబంగ్లా, పగిడ్యాల, కొత్తపల్లి, పాములపాడు, నందికొట్కూరు, మిడ్తూరు మండలాల పరిధిలో గ్యాస్‌, పెట్రోలియం నిక్షేపాలతో పాటు ఖనిజ సంపద కోసం సర్వేచేపట్టారు. ఈ సర్వే రిపోర్టుల ఆధారంగా ప్రస్తుతం ఓఎన్‌జీసీ అధికారులు వారి వద్దనున్న సాంకేతిక పరిజ్ఞానంతో తర్తూరు అంచె సమీపంలోని కేజీ రోడ్డు పక్కనున్న పొలాలతో పాటు సమీపంలోని పొలాల్లో సర్వేచేపట్టారు. సర్వే నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు.

అరకొరగా

కౌలు కార్డుల పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో కౌలుకార్డు(సీసీఆర్‌సీ)లు అరకొరగా పంపిణీ చేశా రు. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో 30 వేలు, నంద్యాల జిల్లాలో 25 వేల సీసీఆర్‌సీ(క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డు)లు జారీ చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 7,177, నంద్యాల జిల్లాలో కేవలం 732 మాత్రమే అందించారు. సాధారణంగా ఏప్రిల్‌ నెలలో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంది. వ్యవసాయ శాఖ ఇందుకు షెడ్యూల్‌ ఇచ్చినప్పటికి కర్నూలు, నంద్యాల జిల్లాలో గ్రామసభలు నిర్వహించిన దాఖలాలే లేవు. తూతూ మంత్రంగా వ్యవసాయ శాఖ కౌలుదారులకు సీసీఆర్‌ కార్డులు జారీ చేస్తోంది.

క్వింటా వేరుశనగ రూ.7,500

ఎమ్మిగనూరుటౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,500 ధర పలికింది. మార్కెట్‌కు 32 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు వచ్చాయి. క్వింటా కనిష్ట ధర రూ.6,470, మధ్యస్థ ధర రూ.6,800 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement