కల్లూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాన్ని మంగళవారం కల్లూరు అర్బన్ ముజఫర్నగర్ సమీపంలోని ఎస్ఆర్. కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నాయకులు నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేసి నిరసన వ్యక్తం చేశా రు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో పాటు సూపర్ సిక్స్ హామీలను ఇస్తామని చెప్పి కూటమి నాయకులు ప్రజల ను వంచించారన్నారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి రైతులను మోసం చేశారన్నారు. ప్రస్తుతం గ్రామాలకో నాలుగు బెల్టు షాపులు వెలిశాయని, బ్రాందీ షాపులు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ నాయకులు తనను కబ్జాదారుడని ఆరోపించారని.. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు ఒక్క ఆరోపణనైనా నిరూపించగలిగారా .. అని కాటసాని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బీవై రామయ్య, మాజీ డిప్యూటీ మేయర్ ఎస్. రేణుక, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


