● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బూత్ స్థాయి అధికారులను (బీఎల్ఓలు) ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమ శిక్షణలో కలెక్టర్ పాల్గొని బీఎల్ఓలకు మార్గదర్శకాలు అందించారు. జిల్లాలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలన్నారు. ఓటర్లు తప్పుడు వివరాలతో డిక్లరేషన్ ఇస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్–31 ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చ రించారు. అలాగే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం లేదా అధికారిక విధుల ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై సెక్షన్–32 కింద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ, అప్పటి వరకు వేచి ఉండకుండా వెంటనే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టాలని బీఎల్ఓలకు సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూడాలని, అవసరమైతే కేంద్రాల విభజన చేపట్టాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.


