పోలింగ్ బూత్ ఏజెంట్లు
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే
కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని, త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో పోలింగ్ బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్లలోని పార్టీ కార్యాలయం ఆవరణలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ బూత్ ఏజెంట్లకు ‘సర్’పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తొలగిపోవడంతో అక్కడ అభ్యర్థుల గెలుపుపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ‘సర్’లో భాగంగా ఓట్లు తొలగిపోతే తిరిగి తెచ్చుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. ముందుగా పార్టీకి చెందిన కుటుంబ సభ్యుల ఓట్లు తనిఖీ చేసుకోవాలన్నారు
పట్టుదలతో పని చేయాలి
ఈనెల 15 నుంచి ‘సర్’ కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతుందని పార్టీ శ్రేణులంతా పట్టు దలతో పనిచేయాలని కాటసాని సూచించారు. బోగస్ ఓట్లు తొలగించడంతో పాటు 18 ఏళ్లు నిండిన వాళ్లకు ఓటు హక్కు కల్పించేలా చూసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఓటు కీలకం అవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయని గుర్తు చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి వరకు లక్షలాది ఓట్లు పోల్ అయ్యాయన్నారు. దీనికి సంబంధించిన వీవీప్యాట్లలో కూడా సమాధానం దొరక్కపోవడంతో ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతుందన్నారు. ఈనెల 12న బనగానపల్లెలో నిర్వహించే ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనకు పార్టీ నాయకులు భారీగా తరలిరావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్రెడ్డి, నాయకులు సత్తిగారి రామిరెడ్డి, మూల ఈశ్వరరెడ్డి, మొలక రాజారెడ్డి, మహేశ్వరరెడ్డి, భాస్కర్రెడ్డి, డాక్టర్ దస్తగిరి, శంకర్రెడ్డి, నందకిషోర్రెడ్డి, కంబయ్య, వెంకటేశ్వరరెడ్డి, గుర్విరెడ్డి, రామనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, చిత్రంలో జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, హాజరైన ముఖ్య నాయకులు, కార్యకర్తలు
అప్రమత్తంగా ఉండాలి
కాటసాని రామిరెడ్డి


