అట్టహాసంగా ‘గురురాజా’ వార్షికోత్సవం
గోస్పాడు: గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. మండలంలోని బాబానగర్ గ్రామంలో ఉన్న ఈస్కూల్లో ఆదివారం నిర్వహించిన వార్షికోత్సవానికి స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి 24వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల ఉన్నత శిఖరాలను అధిరోహించేలా బోధన సాగిస్తున్న గురురాజా పాఠశాల యాజమాన్యాన్ని మంత్రి ఫరూక్ అభినందించారు. గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 2002 సంవత్సరంలో 120 మంది విద్యార్థులతో ప్రారంభమైన గురు రాజా ఇంగ్లిష్ మీడియం స్కూల్ నేడు 24వ వార్షికోత్సవం జరుపుకుంటుందంటే ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాలలోనీ గురరాజా ఇంగ్లిష్ మీడియం పాఠశాల రాష్ట్రస్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు పొందిందని చెప్పారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థ డైరెక్టర్లు పి. మౌలాలి రెడ్డి, షేక్షావలి రెడ్డి, అతిథులను సత్కరించారు. టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, మౌలాలి రెడ్డి. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


