● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి దరఖాస్తును సమయానుకూలంగా పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం 71 అర్జీలు ఇంకా ఓపెన్ చేయలేదన్నారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అందజేసే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. రీ–ఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవి మళ్లీ పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ క్లినిక్స్లో 130 అర్జీల స్వీకరణ...
భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్స్ను సద్వినియోగం చేసుకోవా లన్నారు. సోమవారం రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 130 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో సచివాలయ సేవలకు సంబంధించినవి 4, అడంగల్ సవరణలకు సంబంధించినవి 22, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22–ఎ భూములకు సంబంధించినవి 19, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి 18, రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్ఓఆర్కు సంబంధించినవి 26 ఉన్నాయన్నారు.


