● శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు
శ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాలపై శ్రీశైల దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనం కల్పించబడుతుందన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లుగా అన్ని ఏర్పాట్లు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయా లని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సహకారంతో పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం, సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాసద్వారం, క్షేత్రంలో భక్తులు సేద తీరే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలన్నారు. కాలిబాట మార్గంలో, క్షేత్రంలో అన్నదానం చేసే దాతలకు దేవస్థానం తరఫున పూర్తి సహా య సహకారాలను అందిస్తామన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందజేస్తామన్నారు. క్యూలైన్లలో అవసరమైన చోట కూలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్ర పరిధిలో భక్తులు సేద తీరేందుకు షామియానాలు, పైప్ పెండ్యాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్షేత్ర పరిధిలో పలు చోట్ల తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు.


