ప్రతి కార్మికుడికి ఈ–శ్రామ్ కార్డులు
కర్నూలు: అసంఘటిత రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడు కార్మిక శాఖ జారీ చేసే ఈ–శ్రామ్ కార్డులు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యుడు రాయపాటి శ్రీనివాసులు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో కర్నూలు వెంకటరమణ కాలనీలోని రైతు మార్కెట్లో అసంఘటిత కార్మికులకు ఏర్పాటు చేసిన ఈ–శ్రామ్ కార్డుల నమోదు కేంద్రం, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లీలా వెంకటశేషాద్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి, హెల్త్ చెకప్లను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కార్మికులకు చట్టపరమైన సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100కు కాల్ చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా 40 మంది కార్మికులకు ఈ–శ్రామ్ కార్డులు, ఐదుగురికి పెన్షన్ కార్డులను అందజేశారు. అనంతరం కంటి వైద్యనిపుణులు డాక్టర్ జయరాం, డాక్టర్ రంగనాథ్, ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్మికులకు కంటి వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించారు.


