క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం
● సమర్థవంతంగా పీఎం రాహత్
పథకం అమలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణం నగదు రహిత వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకం అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రవాణాశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, రోడ్లు, భవనాలు శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో బుధశారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి 7 రోజుల్లో ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందిస్తారని తెలిపారు. పోలీసుల ధ్రువీకరణ అనంతరం సాధారణ గాయాల కేసుల్లో 24 గంటల పాటు, తీవ్ర గాయాల కేసుల్లో 48 గంటల పాటు స్థిరీకరణ వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ పథకం కింద ఆసుపత్రులకు చెల్లింపులు మోటారు వాహన ప్రమాద నిధి ద్వారా చేరతాయన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం బీమా చేసినట్లయితే బీమా సంస్థలు వ్యయాన్ని భరిస్తాయని తెలిపారు. బీమా చేయని వాహనాలు ఉన్న సమయంలో భారత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ఖర్చును భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలతో కలిగే ప్రాణనష్టాన్ని తగ్గించడంలో అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.


