అరెస్టుల మధ్య ప్రమాణ స్వీకారం
● ‘ఉరుకుంద’ చైర్మన్గా
పాండురంగయ్య ప్రమాణం
● తీవ్ర నిరసన తెలిపిన తెలుగు తమ్ముళ్లు
● హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
కౌతాళంలో టీడీపీ నాయకుడు చెన్నబసప్పను అరెస్ట్ చేసి పోలీసులు
ఉరుకుందలో టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పాలక మండలి సభ్యుల ప్రమాణాస్వీకారం సొంత పార్టీ నేతల అరెస్టుల నడుమ పోలీస్ బందోబస్తు మధ్య జరిగింది. మంత్రి టీజీ భరత్ చిన్నాయన పాండురంగయ్య శెట్టిని చైర్మెన్గా పాలకమండలి ఎన్నికకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై కౌతాళం మండలంతో పాటు నియోజవర్గంలోని టీడీపీ నేతలు బహిరంగంగా నిరసనకు దిగారు. కొందరు రాజీనామాలూ చేస్తున్నారు. బుధవారం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం వద్ద కౌతాళం మండలం నేతలు, మాజీ ట్రస్ట్బోర్డు చెర్మన్లు చెన్నబసప్ప, శివమోహన్ రెడ్డి, కోట్రేష్ గౌడ, కురుగోడు, మంత్రాలయం నాయకుడు పన్నాగ వెంకటేష్, కోసిగి నాయకుడు భరత్ శెట్టి, పెద్ద కడుబూరు నాయకులు సుమారు 400 మందితో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. పార్టీ అధిష్టానం స్పందించక పోతే విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఇదిలా ఉంటే మరో వైపు మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో పూర్తి స్థాయిలో పాలక మండలి సభ్యులు రాకపోయినా హడావుడిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముందు జాగ్రత్తగా సొంత పార్టీ నేతలు మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చెన్నబసప్పను కౌతాళంలో, మాజీ డైరెక్టర్ కోట్రేష్ గౌడు, మాజీ ఎంపీటీసీ కురుగోడు తదితరులను ఉరుకుందలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అరెస్టుల మధ్య ప్రమాణ స్వీకారం


