టీబీ డ్యాం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
ఆలూరు: టీబీ డ్యాం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఈనెల 24వ తేదీన 20 గేట్లు ఎత్తి 62.610 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డ్యాం కు ఇన్ ఫ్లో 74.555 క్యూసెక్కులు, ఔట్ప్లో 85.616 క్యూసెక్కులు ఉంది. 105.788 సామర్థ్యం గల డ్యాంలో 75.612 టీఎంసీల నీరు నిలువ ఉంది. కాగా రబీ సీజన్లో ఎల్లెల్సీ కింద వివిధ పంటలు సాగయ్యాయి. నీటి విడుదల తగ్గిపోవడంతో పంటలు చేతికి వస్తాయోలేదోననే భయం రైతులకు పట్టుకుంది.
హత్య కేసులో ముద్దాయి అరెస్ట్
అవుకు(కొలిమిగుండ్ల): తండ్రి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అవుకు పోలీస్ స్టేషన్లో బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి వివరాలను విలేకరులకు వెల్లడించారు. మండలంలోని ఉప్పులపాడు గ్రామానికి చెందిన మంగలి శివరాముడిని కుమారుడు నాగశేఖర్ 2022లో హత్య చేశాడు. వీటికి సంబంధించి నంద్యాల అడిషనల్ సెషన్స్ కోర్టుకు ముద్దాయి హాజరు కాక పోవడం, వాయిదాలకు వెళ్లకుండా ఉండటంతో కోర్టు ముద్దాయిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ పర్యవేక్షణలో అవుకు ఎస్ఐ అశోక్ సిబ్బందిని రెండు బృందాలుగా ఏర్పాటు చేసి బెంగళూరు,కర్ణాటక తదితర ప్రాంతాల్లో వెతుకుతూ వచ్చారు. చివరకు మండలంలోని సంగపట్నం ఊరి వాకిలి వద్ద పట్టుబడటంతో అదుపులోకి తీసుకొని నంద్యాల కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ తెలిపారు.


