40 ఏళ్ల భూ పరిహారం కేసు పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): లోకాయుక్త చొరవతో 40 ఏళ్లనాటి భూ పరిహారం కేసు పరిష్కారమైంది. ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ బాధిత రైతుకు రూ.1,47,078 నష్టపరిహారం అందించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం బొర్రపాళెంగ్రామానికి చెందిన కేవీఎస్ సూర్యనారాయణ మూర్తికి చెందిన టీ.నర్సాపురం మండలం సర్వే నంబర్ 67/2లోని 0.76 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎస్కేకేవైఆర్ ప్రాజెక్టు కోసం 1980 అక్టోబర 27వ తేదీన స్వాధీనం చేసుకుంది. అయితే సదరు భూమికి సంబంధించి నష్టపరిహారం కేసులో మంజూరైన పరిహారంపై అప్పటి బాధిత రైతు తండ్రి లేటు అప్పారావు ఒప్పుకోలేదు. దీంతో ఆయన కుమారుడు కేవీఎస్ సూర్యనారాయణ మూర్తి పరిహారం కోసం లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ క్రమంలో 40 సంవత్సరాలు గడిచిన తరువాత లోకాయుక్త కేసును పరిష్కరించి బాధితుడికి రూ.1.47 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో కేసును మూసి వేస్తున్నట్లు ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ బుధవారం ప్రకటించారు.


