భక్త హనుమా.. వైభవం కనుమా!
ఆళ్లగడ్డ: అహోబిల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం అంబరాన్ని తాకుతోంది. ఎగువ, దిగువ అహోబిలంలో ఓబులేశుడి ఉత్సవాలను తిలకించిన భక్తజనం పరవశించిపోయారు. మంగళవారం హంస, సూర్యప్రభ, యోగా నరసింహ గరుడ, హనుమంత వాహనాలపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని భక్తులు దర్శించుకుని పులకించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం జ్వాలా నరసింహుడు హనుమంత వాహనంపై ఊరేగారు. త్రేతాయు గం నాటి శ్రీరాముడిని తానేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. అనన్య భక్తుడైన హనుమంతు వాహన సేవ లో స్వామివారు కోదండరామ అలంకరణలో భక్తుల ను కటాక్షించారు. కృతయుగంలో వేంకటేశ్వరుడిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా, కలియుగంలో అహోబిలేశుడిగా అవతరించారన్న సందేశాన్ని చాటుతూ మాడవీధుల్లో హనుమంత వాహనసేవ.. రామరాజ్య వైభవాన్ని సాక్షాత్కరింపజేసింది. ఉదయం యోగా నరసింహ గరుడ విమాన వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
దిగువ అహోబిలంలో..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉదయం హంస వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే నిత్యపూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అర్చన అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలోని హంస వాహనంపై కొలువై మాడవీధుల్లో విహరించారు. దేవాలయ ప్రాంగణం నుంచి అహోబిల మఠం చేరుకున్న హంస వాహానధీశుడైన అహోబిలేశునికి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వాములను యాగశాలలో కొలువుంచి పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువైన ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
కనుల పండువగా అహోబిలేశుడి
బ్రహ్మోత్సవాలు
హనుమంత వాహనంపై ఊరేగిన
జ్వాలా నరసింహుడు
హంస, సూర్యప్రభ వాహనాలపై
దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు
భక్త హనుమా.. వైభవం కనుమా!
భక్త హనుమా.. వైభవం కనుమా!


