నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
బండిఆత్మకూరు: హోటళ్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి జ్యోతి రవిబాబు హెచ్చరించారు. మంగళవారం బండి ఆత్మకూరు బస్టాండ్ ఆవరణలో హోటళ్లను జిల్లా పౌర సరఫరాల అధికారులు తనిఖీ చేశారు. పలు హోటళ్లలో గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వాణిజ్య కార్యకలాపాల కోసం తప్పకుండా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని జ్యోతి రవిబాబు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట సివిల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
చదువుతోనే పేదరికం నిర్మూలన
సంజామల: చదువుతోనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జగ్గయ్య అన్నారు. మండల కేంద్రం సంజామల ప్రభుత్వ హాస్టల్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పదో తరగతి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు వారి అభిప్రాయాల మేరకు చదివించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటూ ఎంతో మంది విద్యార్థులు ఐపీఎస్, ఐఎఎస్లు అయ్యారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీసీ హాస్టల్ డోన్ క్లస్టర్ ఇన్చార్జ్ మునిరాజు, ఉపాధ్యాయులు బాషా తదితరులు పాల్గొన్నారు.
మట్టి మిద్దె కూలి వృద్ధురాలు మృతి
నందికొట్కూరు రూరల్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తత గ్రామమైన మండల పరిధిలోని కొణిదేలలో మట్టిమిద్దె కూలి వృద్ధురాలు గ్రంధే లక్ష్మిదేవి(80) మృతి చెందిగా మరో మహిళకు గాయాలయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలి పిన వివరాలివీ.. గ్రామానికి చెందిన లక్ష్మిదేవికి ఇద్దరు కుమారులు సంతానం. ఉమ్మడి కుటుంబంలో కుమారులతో కలిసి జీవనం సాగిస్తోంది. ఇంటి పక్కనే మట్టి మిద్దెలో జిలాన్ నిర్వహిస్తున్న పిండి మిషన్ వద్ద జొన్నలు పిండి పట్టించేందుకు వృద్ధురాలు, కుర్వ సాలమ్మ కలసి వెళ్లారు. ఆ సమయంలో మట్టిమిద్దె కూలడంతో వృద్ధురాలు మృతి చెందగా, మరో మహిళ కుర్వ సాలమ్మ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నందికొట్కూరు ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


