‘సూర్యఘర్’ ప్రయోజనాలను వివరించండి
● ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య
నంద్యాల(అర్బన్): పేదలకు విద్యుత్ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య అన్నారు. స్థానిక ఎస్ఈ కార్యాలయంలో మంగళవారం అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యఘర్ ఏర్పాటులో ప్రస్తుతం నంద్యాల జిల్లా మూడో స్థానంలో ఉందని, మొదటి స్థానం సాధించేలా అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కృషి చేయాలన్నారు. సూర్యఘర్ ప్రయోజనాలను వివరించడంతో పాటు పురోగతిని మెరుగు పరచడానికి వినియోగదారుల ఇళ్లకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బ్యాంకర్లు సకాలంలో సూర్యఘర్కు సంబంధించి సబ్సిడీ రుణాలు అందేలా చూడాలన్నారు. ఫీడర్ సోలరైజేషన్ను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ సుధాకర్కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరంలో ‘కరెంటోళ్ల జనబాట’
కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం నంద్యాల మండలం భీమవరం గ్రామంలో ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లో ఓల్టేజీ సమస్యలు, ఎత్తు తక్కువగా ఉన్న స్తంభాలు, తదితర వాటిని సీజేఎంకు స్థానికులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్కు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా సత్వరమే పరిష్కరించాలని అసిస్టెంట్ ఇంజినీర్ సుధాకర్ను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రమణ్యం, అసిస్టెంట్ లైన్మెన్ రాముడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


