నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 24వ తేదీ వరకు జరుగనున్నాయి. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులనే ఇన్విజిలేటర్లుగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. పరీక్షలకు జిల్లాలో మొత్తం 55 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని మొదటి సంవత్సరానికి చెందిన విద్యార్థులు 15,443, ద్వితీయ సంవత్సరానికి 14,632 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షకు అర్ధ గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో గది గదికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, జోనల్, రాష్ట్ర స్థాయి ఇంటర్మీడియెట్ కార్యాలయం వరకు పర్యవేక్షణ చేసేందుకు లైవ్స్ట్రీమ్ సదుపాయాలను కల్పించారు. పరీక్షలకు నిర్దేశించిన వేళకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను కల్పించారు. పరీక్షల నిర్వహణపై సిట్టింగ్ స్వాడ్ 8 మంది, ఫై్ౖలయింగ్ స్వాడ్లు ముగ్గురు, ఇన్విజిలేటర్లు 300 మందిని నియమించారు. సమస్యాత్మక కేంద్రాల దగ్గర 144 సెక్షన్తో పాటు, అదనపు పోలీసు బంద్ బస్తూ ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ శంకర్నాయక్ ఆదివారం తెలిపారు. జిల్లాలోని గోస్పాడు,నంద్యాల పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
నేడు కలెక్టరేట్లోప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 23 తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
వసతి గదుల నిర్మాణానికి రూ. 65 లక్షల విరాళం
మహానంది: మహానంది క్షేత్రంలో నూతనంగా నిర్మించనున్న 55 వసతి గదుల సముదాయంలో మొదటి అంతస్తు నిర్మాణానికి హైదరాబాద్కు చెందిన ఎన్ఆర్ఐ వడ్లమూడి సరోజిని తన వంతుగా గతంలోనే రూ.1.25కోట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, సీనియర్ అసిస్టెంట్ జగదీష్ల ఆధ్వర్యంలో రూ. 65 లక్షల చెక్కును అందజేశారు. దాత సరోజినికి అర్చకులు శివశంకర శర్మ, రాజమాణిక్యశర్మ, మణికంఠశర్మలు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు


