
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 18, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు, రాయని వారు కూడా అర్హులని తెలిపారు. విద్యార్థులు ఈనెల 5వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
సేద్యం ఖర్చులు
తగ్గిస్తూ తీర్మానం
పగిడ్యాల: రైతుల సేద్య ఖర్చులను తగ్గిస్తూ గ్రామ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. కూలీ రేట్లు, గడెం, ట్రాక్టర్ బాడుగలు నిర్ణయించిన మేరకే తీసుకోవాలని ఆదేశించారు. కమిటీ తీర్మానం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు. నెహ్రూనగర్ సచివాలయ రచ్చకట్ట వద్ద రైతులతో శనివారం గ్రామ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రైతులు పలు సమస్యలు చెప్పడంతో పై నిర్ణయం తీసుకున్నారు.
వీబీఆర్లో 14 టీఎంసీల నీరు
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)లో శనివారం సాయంత్రానికి 14.793 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈ శివనాయక్ తెలిపారు. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వీబీర్కు 14,600 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. వీబీఆర్ నుంచి మద్రాస్ కాల్వ, స్విల్వే, వన్ ఆర్, వన్ఎల్ తూముల నుంచి 14,580 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
వైద్యాధికారికి, సిబ్బందికి మెమోలు
కొత్తపల్లి: ఎర్రమఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారి, సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి వెంకటరమణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తనకు చెప్పకుండా సెలవు తీసుకోవడంతో వైద్యాధికారికి మెమో ఇచ్చానని పేర్కొన్నారు. విధుల్లో వైద్యం సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని, వైద్యశాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మెమో జారీ చేసినట్లు తెలిపారు.
పీఆర్సీ కోసం ఉపాధ్యాయుల ధర్నా
నంద్యాల(న్యూటౌన్): ఫ్యాప్టో సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలోని కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయలు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కరువు భత్యాలను విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు హృదయరాజు, ఫ్యాప్టో చైర్మన్ శివయ్య, జనరల్ సెక్రటరీ దస్తగిరిబాషా, నగరి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పీ4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. రిటైర్మెంట్ అయిన వారికి వెంటనే గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాస్మెంట్ తదితర బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓ రామునాయక్కు అందజేశారు. ఫ్యాప్టో నాయకులు సుధాకర్, మౌలాలి, అజాంబేగ్, గోపాలకృష్ణ, ఏపీటీఎఫ్ నాయకులు రామచంద్రారెడ్డి, భాస్కరరెడ్డి, మాధవస్వామి, సాంబశివుడు, జానీబాషా, మహమ్మద్ అనీఫ్, యూనిస్ బాషా, రవికుమార్, సుబ్బన్న, లక్ష్మణనాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్
● 5, 6 తేదీల్లో భారీ వర్షాలు
కురిసే అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): రుతుపవనాల ప్రభావం వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 6 తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంతపురం వాతావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఈ నెల 5వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించిందని, 6వ తేదీన కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ ఉందన్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల ఆయా తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజుకు 64.5 నుంచి 115.5 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తారన్నారు.