
బ్యాంకుల్లో చోరీలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత
● జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల: బ్యాంకుల్లో దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలపై శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో చోరీలు జరిగాయని, అలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నగదు రవాణా సమయంలో శిక్షణ పొందిన లైసెన్స్ కలిగిన ఆయుధం ఉన్న గార్డులను నియమించాలని సూచించారు. బ్యాంక్లో అత్యవసర కాల్ నంబర్లు, సైబర్ క్రైమ్కు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు బ్యాంకు అధికారులకు, పోలీసు స్టేషన్కు కాల్ చేసే సౌకర్యంతో కూడిన అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు
నంద్యాల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకు చెందిన పలువురికి పార్టీ అనుబంధ రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా కురువ సుంకన్న(పాణ్యం), రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా ఎస్.నాగేంద్ర(పాణ్యం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా ఏవీ కృష్ణారెడ్డి(శ్రీశైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా ఎస్వీ రమణారెడ్డి(శైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా కె.బాబు(పాణ్యం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా వి.రామకృష్ణుడు(శ్రీశైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా బి.అబ్దుల్ఖాదర్ జిలానీ(శ్రీశైలం)లను నియమించారు.
గురుకులాల్లో
నేరుగా ప్రవేశాలు
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీయట్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, నేరుగా భర్తీ చేయనున్నట్లు డీసీఓ శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరికెల బాలుర కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు 48, కంబాలపాడు బాలికల కళాశాలలో సీఈసీలో నాలుగు సీట్లు, బైపీసీ, జనరల్ విభాగంలో ఒక సీటు ఖాళీగా ఉందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో పదో తరగతిలో 24, సీనియర్ ఇంటర్లో 2002, నంద్యాల జిల్లాలోని పదో తరగతిలో 16, సీనియర్ ఇంటర్లో 88 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9866616633, 9010070219 నంబర్లను సంప్రదించాలన్నారు.
నాణ్యతతో ‘అమృత్’ పనులు పూర్తి చేయాలి
డోన్ టౌన్: అమృత్ భారత్ మహోత్సవ్ పథకం కింద చేపట్టిన పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ సంజీవ్కుమార్ శ్రీవాత్సవ ఆదేశించారు. ప్రత్యేక రైలులో గుంతకల్లు నుంచి హైదరాబాద్వైపు వెళుతూ డోన్ రైల్వే స్టేషన్లో శుక్రవారం కాసేపు ఆగారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఆయన వెంట స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, గుంతకల్లు డివిజన్ అధికారులు ఉన్నారు.
ఆభరణాలు, వెండి పళ్లెం బహూకరణ
డోన్ టౌన్: అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి రూ.1.50 లక్షల విలువ చేసే ఆభరణాలను డోన్ పట్టణం కొండపేటకు చెందిన భాస్కర్గౌడ్, అరుణ్జ్యోతి దంపతులు బహూకరించారు. అలాగే డోన్ శ్రీషిర్డీ సాయిబాబా గుడికి రూ.43వేల విలువ చేసే వెండి పళ్లెం శుక్రవారం అందజేశారు.

బ్యాంకుల్లో చోరీలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత

బ్యాంకుల్లో చోరీలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత