నల్లగొండ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 24న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఈ జాబ్మేళాలో పాల్గొంటాయని, ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, డిగ్రీ, ఐటీఐ, బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బీఎస్సీ నర్సింగ్, డీ/బీ/ఎం అర్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చరి తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. వివరాలకు 08682–223362, 7893420435 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం
నిడమనూరు : రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిడమనూరు మండలంలోని బొకమంతలపహాడ్లో నిర్వహిస్తున్న రీ సర్వేను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 32 మండలాల్లో 70 గ్రామాల్లో రోవర్ సాయంతో రెవెన్యూ టీమ్లు రీ సర్వే చేస్తున్నాయన్నారు. రీ సర్వేతో భూమి హక్కులు డిజిటల్ రూపంలో, ప్రతి భూమి హక్కుదారుడి డిజిటల్ పార్సల్ అందజేస్తామన్నారు. రీ సర్వే చేపడుతున్న గ్రామంలో మొదట గ్రామ హద్దులు, గ్రామ కంఠం ప్రభుత్వ భూముల సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. బొకమంతలపహాడ్లో రీసర్వేపై తహసీల్దారు కృష్ణయ్య, సర్వేయర్ గాయత్రితో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మారపు వెంకన్న, డీటీ సైదులు, నజీర్, జీపీవో సైదులు ఉన్నారు.
జిల్లా గ్రంథాలయంలో దాశరథి జయంతి
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ దాశరథి కృష్ణమాచార్యుల జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా తన కవిత్వాన్నే ఆయుధంగా మలచిన మహనీయుడు దాశరథి అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, కవి యాదగిరిరెడ్డి, రాజేష్, శ్రీనివాస్, కుసుమ, శారద, మల్లేష్, శ్రీను పాల్గొన్నారు.


