దర్వేశిపురం శ్రీరేణుకాఎల్లమ్మ ఆలయ బ్రహ్మో త్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా చూస్తాం. జిల్లా నలుమాలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి.
– చీదేటి వెంకట్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్
కనగల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కనగల్ మండలం దర్వేశిపురం స్టేజి వద్ద గల శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 23 నుంచి 25వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, లైటింగ్ ఏర్పాటు చేశారు.
పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కోమటిరెడ్డి, గుత్తా..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 23న నిత్య పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం సుప్రభాతసేవ, లలితా సహస్రనామర్చన, బాలభోగ నివేదన అనంతరం ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. 24న శ్రీజమదగ్ని మహర్షి–ఎల్లమ్మ అమ్మవార్ల 24వ వార్షిక తిరుకల్యాణ మహోత్సవాన్ని బ్రహ్మశ్రీ డేరం భాస్కరశర్మ గారిచే దేవస్థాన ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణకుమారాచార్యులు, అర్చకులు గాదె ఉమామహేశ్వర్రావు, దామోదర్రావు నేతృత్వంలో జరిపించనున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
ఫ ముస్తాబవుతున్న దర్వేశిపురం దేవస్థానం
ఫ 24న అమ్మవారి కల్యాణ మహోత్సవం


