3,300 ఇళ్లు రదు్ద!
ఇందిరమ్మ గృహాలకు ‘నిబంధనల’ గ్రహణం
ధరల సెగ.. మధ్యలోనే నిర్మాణాలు
ముందే కడితే మొండిచేయే!
నల్లగొండ : పేదవాడి సొంతింటి కలపై నిబంధనల నీలినీడలు ముసురుకుంటున్నాయి. దీంతో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఒకవైపు పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, మరోవైపు ప్రభుత్వ కఠిన నిబంధనలతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లో పడ్డారు. ఫలితంగా, ఇళ్లు మంజూరైనా పునాది రాయి వేయని (ముగ్గు పోయని) సుమారు 3,300 ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆ స్థానాల్లో అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇళ్ల కేటాయింపు ఇలా..
జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజక వర్గాలకు మొత్తం 19,625 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు రెండు విడతల్లో అధికారులు 17,247 ఇళ్లు మంజూరు చేశారు. రెండు విడతల్లో మంజూరైన ఇళ్లలో ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి రెండో విడతలో ఇళ్ల స్థలం కూడా లేనివారికి ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి మంజూరు పత్రాలను అందించారు.
అందని ‘బేస్మెంట్’ చేయూత
ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నప్పటికీ, ప్రాథమిక స్థాయిలోనే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బేస్మెంట్ నిర్మించుకోవడానికే సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుండగా, చేతిలో చిల్లిగవ్వ లేక పేదలు పనులు మొదలుపెట్టలేకపోతున్నారు. దీనికితోడు 600 చదరపు అడుగులలోపు నిర్మిస్తేనే బిల్లులు వస్తాయనే నిబంధన పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి కుటుంబాల అవసరాల దృష్ట్యా కొంత పెద్దగా నిర్మించుకోవాలని భావిస్తున్న వారికి ఈ నిబంధనలు శాపంగా మారాయి. నిబంధనలు అడ్డురావడంతో మంజూరైన ఇళ్లను చాలా మంది వదిలేసుకున్నారు.
నిర్మాణ దశల్లో ఉన్నవి 13 వేలకుపైనే..
జిల్లాకు కేటాయించిన ఇళ్లు 19,625
ఇప్పటి వరకు మంజూరైనవి 17,247
ఫ ఆర్థిక భారంతో
వెనకడుగు వేస్తున్న పేదలు
ఫ కొత్త లబ్ధిదారుల వేటలో యంత్రాంగం
ఫ ఇంటి నిర్మాణ వ్యయం పెంచాలని
లబ్ధిదారుల వేడుకోలు
ప్రస్తుతం సిమెంట్, స్టీలు, ఇసుక ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వ సాయం రూ.5 లక్షలు ఉంటే, ఒక సాధారణ ఇంటి నిర్మాణానికి కనీసం రూ.12 లక్షల వరకు ఖర్చవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. పెరుగుతున్న భారంతో పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇందరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని పెంచి, నిబంధనలు సడలించి పేదల సొంతింటి కలను సాకారం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
కొందరు లబ్ధిదారులు తమ పేరు జాబితాలో రాగానే, ఉత్సాహంతో ముందే అప్పులు చేసి బేస్మెంట్లు నిర్మించుకున్నారు. అయితే, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ‘పాత నిర్మాణాలకు నిధులు ఇవ్వలేం’ అని తేల్చి చెబుతుండడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నల్లగొండ మండలం నర్సింగ్బట్లకు చెందిన శేఖర్ అనే లబ్ధిదారుడు లక్ష రూపాయలు వెచ్చించి బేస్మెంట్ నిర్మించుకున్నా, నిబంధనల వల్ల పైసా అందలేదు. దీంతో చేసేదేమీ లేక అప్పులు చేసి సొంతంగానే పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చింది.


