బుద్ధవనం సందర్శించిన దక్షిణ కొరియా ప్రతినిధులు
నాగార్జునసాగర్: దక్షిణ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యా సాంస్కృతిక ప్రతినిధుల బృందం సభ్యులు కాంగ్సుంగ్, చోయ్ సేంగహో, మిన్ క్యేయోంగ్వూ, కవన్ జిన్ వోక్, శేషు, చిరాగ్ జలది తదితరులు ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. హైదరాబాద్లో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న వీరు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా బుద్ధచరిత వనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనాలను సందర్శించారు. స్థూప వనంలో నిర్మించిన దక్షిణ కొరియా మహాస్థూపాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు వారిని ఘనంగా సత్కరించారు. బుద్ధవనంలో చేపట్టబోయే నూతన నిర్మాణాల గురించి వారికి తెలిపారు. వారి వెంట స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ ఉన్నారు.


