అప్పుల బాధతో చిరు వ్యాపారి ఆత్మహత్య
నిడమనూరు : అప్పుల బాధతో చిరు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరుకు చెందిన పసుపులేటి కొండలు(45) తన భార్యతో కలిసి హాలియాలో చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హోటల్ నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హాలియాలోని హోటల్ నుంచి నిడమనూరులోని ఇంటికి వచ్చిన కొండలు రాత్రి ఇంటి లోపల పడుకున్నాడు. తమ్ముడు శ్రీనివాస్ ఇంటి బయట నిద్రించాడు. తెల్లవారుజామున శ్రీనివాస్ తన అన్న కొండలును హోటల్కు వెళ్లవా అన్న అంటూ నిద్ర లేపగా కొంచెం సేపు పడుకుని పోతానని సమాధానం చెప్పాడు. అనంతరం శ్రీనివాస్ తెల్లవారుజామున సుమారు 5గంటల సమయంలో మరోసారి కొండలును లేపడానికి వెళ్లగా అప్పటికే కొండలు ఇంటిలోని ఇనుప పైపుకు ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య రమణ ఫిర్యాదుతో ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి భార్య, పదేళ్లలోపు వయస్సు గల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
కోదాడ రూరల్ : చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ చెరువులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన వంగవీటి జయకృష్ణ(40) హైదరాబాద్లోని ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట ఇంటికి వచ్చిన అతను మంగళవారం ఉదయం బయటకు వెళ్తున్నాని చెప్పి చెరువులో శవమై తేలాడు. గేదెల కాపారులు గమనించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బటయకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి గొంతుపై కత్తిగాట్లు ఉండటంతో పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మృతుడు గత కొంతకాలంగా మానసిక ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.
పురుగుల మందు తాగిన యువకుడు మృతి
డిండి : పరుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం డిండిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం చండూరు మండలం శ్యామలపల్లికి చెందిన ఎన్.శ్రీశైలం(30)కు డిండికి చెందిన గిరమోని సంధ్యారాణితో వివాహమైంది. నాలుగేళ్లుగా శ్రీశైలం డిండిలోని ఓ రైస్ మిల్లులో మెకానిక్గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల నుంచి శ్రీశైలం తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. దీంతో ఈనెల 16న శ్రీశైలం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య సంధ్యారాణి కుటుంబ సభ్యులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి తీసుకపోగా అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీశైలంను హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అతడు మృతి చెందాడు. భార్య సంఽంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పామని ఎస్ఐ.బాలకృష్ణ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.


