నారసింహుడికి సమర్పించే పట్టు వస్త్రాల పరిశీలన
భూదాన్పోచంపల్లి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు సమర్పించనున్న పట్టు వస్త్రాలను మంగళవారం యాదగిరిగుట్ట దేవస్థానం అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పట్టు వస్త్రాలను పరిశీలించడానికి వచ్చామని పేర్కొన్నారు.
రెండు పట్టుచీరలు, పట్టుపంచెలు..
పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఏటా శ్రీలక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అమ్మవారికి తంగేడుపూల రంగు, ప్యాక బంగారువర్ణం, ముద్దమందారం డిజైన్లో వంకాయ రంగు కలిగిన అంచు, జరీ బార్డర్ పాన్పటోలా కాంబినేషన్ చీర, మరొక చీర గులాబీలో ఎరుపురంగు బాడీలో తీగతో కూడిన మల్లెపూల డిజైన్, వంకాయ అంచు, జరీ బార్డర్లో కొత్త కాంబినేషన్లో రెండు చీరలను తయారు చేశామని అన్నారు. స్వామివారికి సమర్పించేందుకు రెండు పట్టు పంచెలు, రెండు శాలువాలను 15 రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో మగ్గంపై తయారు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు భోగ నర్సింహ, అంకం మురళి, ప్రధానకార్యదర్శి భారత బాలరత్నం, సహాయ కార్యదర్శి కడవేరు చంద్రమౌళి, కోశాధికారి సంగెం చంద్రయ్య, సభ్యులు గంజి అంజయ్య, గుండు పాండు, కర్నాటి అంజమ్మ, తడక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


