కందనూలు: రాజీమార్గమే.. రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి రమాకాంత్ హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భూ తగాదా, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కుటుంబ కేసులు, మోటారు వాహనాల ఆక్సిడెంట్ కేసులు, బ్యాంకు తదితర పెండింగ్ ఉన్న 9,571 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు అన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు సుఖ సంతోషాలతో జీవించవచ్చన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు నస్రీమా సుల్తానా మాట్లాడుతూ కక్షిదారులు పగలు, ప్రతీకారాలు పెంచుకోకుండా ఇరువర్గాలు రాజీ చేసుకోవడం వల్ల మానవ సంబంధాలు బలపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్రావు తదితరులు పాల్గొన్నారు.


