హైలెవల్.. ముందడుగు
●
ఆత్మకూర్: ఈ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. మండలంలోని జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై హై లెవల్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. రూ.123 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న శంకుస్థాపన చేశారు. వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు ప్రారంభించారు.
● ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లాలంటే 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం అనంతరం గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారపరంగా ఆత్మకూర్, జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.
● కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించడంతో ఆర్అండ్బీశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. గత నెలలోనే పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరతగతిన నిర్మాణం పూసేందుకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు.
జూరాల వద్ద ప్రారంభమైన వంతెన నిర్మాణం
రూ.123 కోట్ల అంచనా వ్యయంతో..
తాత్కాలిక రోడ్డు ఏర్పాటు.. కొనసాగుతున్న రాకపోకలు
ఆత్మకూర్, గద్వాల మధ్య తగ్గనున్న దూరం
రెండేళ్లలో నిర్మాణం పూర్తి..
కృష్ణానదిపై హైలేవల్ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది.
– దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ


