ఆలోచించండి.. ఆవిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఆలోచించండి.. ఆవిష్కరించండి

Jul 21 2025 5:15 AM | Updated on Jul 21 2025 5:15 AM

ఆలోచి

ఆలోచించండి.. ఆవిష్కరించండి

నూతన ఆవిష్కరణలకు ‘ఇన్నోవేషన్‌ ఇన్‌స్పైర్‌ మనక్‌’ వేదిక

విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి.. నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యం

సెప్టెంబర్‌ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ

ప్రతి పాఠశాల నుంచి

ప్రాజెక్టులకు ఆహ్వానం

ఉమ్మడి జిల్లాలో గతేడాది 3,658 దరఖాస్తులు

నారాయణపేట రూరల్‌: విద్యార్థి ఆలోచనలకు సృజనాత్మకత జోడించి.. కొత్త ఆవిష్కరణలు రూపకల్పన చేసేలా ప్రోత్సహిస్తోంది ఇన్నోవేషన్‌ ఇన్‌స్పైర్‌ మనక్‌ వేదిక. ఈ ఏడాది నుంచి వేడుకల్లో ప్రదర్శించే అంశాల్లో నాణ్యతపై దృష్టిపెట్టింది. మూస విధానాలు, ఒకరిని చూసి మరొకరు కొద్దిపాటి మార్పులతో ప్రయోగాలు అనుకరించకుండా ఉండేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. కోవిడ్‌ సమయంలో విద్యార్థులకు నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఒక వేదికను తయారు చేసింది. ఇందులో అన్ని ప్రభుత్వ, అనుబంధ విద్యా సంస్థల్లో చదువుతున్న ఆరు నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇద్దరు విద్యార్థులతో కూడిన జట్టుతో ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులకు మించకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఆ ప్రయోగాలకు నోచాన్స్‌

నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ స్కిల్‌ ఇండియా, మేకింగ్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, మరి కొన్ని అనే నాలుగు విభాగాల్లో దరఖాస్తులు తీసుకుంటుంది. అయితే వివిధ రకాలైన ప్రయోగాల్లో రెగ్యులర్‌గా అనుకరణలు వస్తున్నాయని గుర్తించారు. విద్యార్థులు, సంబంధిత సైన్స్‌ టీచర్లు ఇవి కొత్తగా కనిపించినా సంస్థ మాత్రం చాలా సులువుగా గుర్తిస్తుంది. దీనికితోడు గతంలో ప్రదర్శించిన వాటికి అనుమతి ఉండదని చెబుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో.. నిరుపయోగంగా ఉన్న బ్యాటరీల ద్వారా విద్యుత్‌, శక్తి ఉత్పతి, వర్షపునీటి వినియోగం, నీటి నిల్వ స్థితి– హెచ్చరిక యంత్రాలు, వంటగ్యాస్‌, అగ్నిప్రమాదాలు– అప్రమత్తం చేసే యంత్రాలు, వర్మీ కంపోస్టు, లెటర్‌బాక్స్‌, అలారం, బిందుసేద్యం, సెన్సార్‌ ఆధారిత ప్రదర్శనలు, అప్రయత్నంగా వీధిదీపాల నిర్వహణ, ఆహార పదార్థాల కల్తీ గుర్తింపు, కార్బన్‌ సైకిల్‌, ఆహార గొలుసు, మానవ శరీర అవయవాల ప్రదర్శన, నక్షత్ర మండలం, జలశుద్ధి వంటి పాఠ్యపుస్తకాలు, యూట్యూబ్‌లలో చూసిన ప్రదర్శనలు అనుమతించరు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ రహిత ప్రయోగాలు ఉండాలని నిబంధన ఉంది. మెరుగైన కొత్త వాటికి మాత్రమే అర్హత ఉంటుంది.

గతేడాది జాతీయ స్థాయికి..

గతేడాది నారాయణపేట జిల్లా దామరగిద్ద గురుకుల విద్యార్థి ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా గతేడాది 3,658 దరఖాస్తులు రాగా వాటిలో ఐదు జిల్లాల్లో కలిపి 349 ఎంపిక చేశారు. ఇందులో అత్యుత్తమంగా ఉన్న 10 శాతం ప్రాజెక్టులను స్క్రూట్నీ చేసి రాష్ట్రస్థాయికి నామినేట్‌ చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు ఖర్చులకు అందిస్తారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో పాల్గొన్న వాటిలో ఇప్పటి వరకు జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఒక్క ప్రాజెక్టు ఎంపికై ంది. సింగారం చౌరస్తాలో గల దామరగిద్ద గురుకుల స్కూల్‌ (ప్లాస్టిక్‌ నివారిస్తూ కొబ్బరి పీచుతో చేసిన కుండీలతో కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణ) ప్రాజెక్టు ఇటీవల జపాన్‌లో జరిగిన సకురా సైన్స్‌ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం లభించింది. మొదట ఉపాధ్యాయుల నామినేషన్‌ ప్రక్రియను ఏర్పాటు చేసి ఎస్‌ఐసీ ద్వారా వృత్తిపరమైన వివరాలు అంతర్జాలంలో నిక్షిప్తం చేశారు. రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌లో నమోదై తదుపరి అన్ని రకాల సమాచారం టీచర్‌ సెల్‌కు అందుతుంది. సంబంధిత ఉపాధ్యాయుడికి జూమ్‌ లేదా మరో ప్రసార మాధ్యమం ద్వారా సంబంధిత అంశంపై అవగాహన కల్పిస్తారు.

పాల్గొనేందుకు అర్హతలు

● ప్రభుత్వ, ప్రైవేటు, జెడ్పీ, ఎయిడెడ్‌, కేజీబీవీ, మోడల్‌, మైనార్టీ, గురుకులాల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు

● యూపీఎస్‌ నుంచి రెండు, హైస్కూల్‌ నుంచి ఐదు, కళాశాల నుంచి రెండు చొప్పున ప్రాజెక్టులు గరిష్ఠంగా ఆన్‌లైన్‌ చేయవచ్చు

● ప్రతి తరగతి ఒక సబ్జెక్ట్‌ ఎంపిక చేసుకోవాలి

దరఖాస్తు పద్ధతి ఇలా..

www.inspireawards.gov.in వెబ్‌సైట్‌లో స్కూల్‌ కోడ్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. యూడైస్‌, పాస్‌వర్డ్‌ కొడితే వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది.

విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి నమోదు చేయాలి.

విద్యార్థికి సంబంధించిన బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ (జాతీయ బ్యాంకుల్లో), ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి.

విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా రాతపూర్వకంగా పొందుపరిచి, సంబంధిత రైటప్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.

ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి.

ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లాస్థాయిలో ప్రకటిస్తారు. వాటిని రాష్ట్ర స్థాయికి పంపిస్తారు.

ఎంపికై న ప్రాజెక్టుకు రూ.10 వేల నగదు ప్రయోగ నిమిత్తం బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు.

సెప్టెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్‌లను ఏర్పాటు చేయాలి.

ఆలోచించండి.. ఆవిష్కరించండి1
1/2

ఆలోచించండి.. ఆవిష్కరించండి

ఆలోచించండి.. ఆవిష్కరించండి2
2/2

ఆలోచించండి.. ఆవిష్కరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement