
బఫర్.. సఫర్!
కొల్లాపూర్: జిల్లాలోని వాగులు, నాలాల వెంట బఫర్ జోన్లు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఫలితంగా వాటి సమీపంలోని వెంచర్లలో ప్లాట్లు క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదు. ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో వాగులు, కాల్వల సమీపంలో దశాబ్దాల క్రితం స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు అనుమతులు ఇచ్చినా.. బఫర్ జోన్ల నిర్ధారణ చేపట్టక పోవడంతో ప్లాట్ల క్రమబద్ధీకరణలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
వందల సంఖ్యలో..
జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాలు మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాల్లో వాగులు, చిన్నపాటి కాల్వలను అనుసరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటుచేశారు. వీటిలో వందల సంఖ్యలో ప్రజలు ప్లాట్లు కొనుగోలుచేసి.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. గత ప్రభుత్వం డీటీసీపీ లే అవుట్లు లేని వెంచర్లలో కొనుగోలుచేసిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్కు శ్రీకారం చుట్టింది. ముందుగా ప్లాటుకు రూ.వెయ్యి చొప్పున, వెంచర్కు రూ. 10వేల చొప్పున ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో వేలాది మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వివిధ కారణాలతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించి.. ఫీజు చెల్లింపులో రాయితీ సౌకర్యం కల్పించింది. అయితే మున్సిపాలిటీల్లో ప్రధాన కాల్వలు, నాలాలు, వాగుల వెంట నిబంధనల పేరుతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపును సాంకేతికంగా నిలిపివేయడంతో.. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.
హద్దులు నిర్ణయిస్తే ప్రభుత్వానికి ఆదాయం..
పట్టణ కేంద్రాల సమీపంలో ఉండే వాగులు, నాలాలు, కాల్వలకు బఫర్ జోన్లు నిర్ణయించే బాధ్యతను ప్రభుత్వం మూడు శాఖలకు అప్పగించింది. రెవెన్యూ అధికారులు నక్ష ప్రకారం నీరు ప్రవహించే ప్రాంతాలకు హద్దులు ఏర్పాటుచేసి.. వాటిని ఆన్లైన్లో పొందుపర్చాలి. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ శాఖ ఏర్పాటుచేసిన హద్దు నుంచి నిర్ణీత కొలతల ప్రకారం బఫర్ జోన్ నిర్ణయిస్తారు. దీన్ని కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిర్ణయించిన హద్దులకు వెలుపల ఉన్న ప్లాట్లను మున్సిపల్ లాగిన్లో ఎల్ఆర్ఎస్ ఫీజు స్వీకరణకు కమిషనర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్లాట్ల కొనుగోలు దారులు ఇబ్బందులు పడుతున్నారు. బఫర్ జోన్లు నిర్ణయిస్తే వందలాది సంఖ్యలో ప్లాట్ల వినియోగదారులు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులకు సిద్ధంగా ఉన్నారు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది.
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులోసాంకేతిక సమస్యలు
వాగులు, నాలాల సమీపాన
బఫర్ జోన్ల గుర్తింపులో
అధికారుల నిర్లక్ష్యం
మున్సిపాలిటీల్లో క్రమబద్ధీకరణకు నోచుకోని ప్లాట్లు
జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి