బోగస్‌ పత్రాలతో ఆస్పత్రులు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు | - | Sakshi
Sakshi News home page

బోగస్‌ పత్రాలతో ఆస్పత్రులు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు

Jun 19 2025 3:58 AM | Updated on Jun 19 2025 3:58 AM

బోగస్‌ పత్రాలతో ఆస్పత్రులు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసుల

బోగస్‌ పత్రాలతో ఆస్పత్రులు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసుల

నాగర్‌కర్నూల్‌: బోగస్‌ ధ్రువపత్రాలతో ఆస్పత్రులు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు తప్పవని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతుల జారీపై బుధవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, ఆస్పత్రుల పర్యవేక్షకులు, ప్రోగ్రాం అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలో 72 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని.. కొత్తగా అనుమతుల కోసం 21 ప్రతిపాదనలు వచ్చాయని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. 1994 చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణలో ప్రభుత్వ నియమ, నిబంధనలు అనుసరించాలని సూచించారు. డయాగ్నొస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్ల నిర్వహణలో పారదర్శకత ఉండాలన్నారు. కొత్తగా అనుమతుల కోసం వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఆస్పత్రుల పూర్తి వివరాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. బయో మెడికల్‌ వేస్టేజ్‌ పద్ధతులు పాటించడం, ఆస్పత్రుల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీల్లో అనుమతి కాలపరిమితి, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి ఆస్పత్రి, డయాగ్నొస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లలో చికిత్స, వైద్య పరీక్షలకు విధించే రుసుమును ప్రదర్శించాలన్నారు. అర్హత కలిగిన వైద్యులు, స్పెషలిస్టులను మాత్రమే నియమించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. కన్సల్టేషన్‌ వైద్యుడిని రప్పించి వైద్యం అందిస్తే అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. స్కానింగ్‌ సెంటర్లలో పనిచేయని యంత్రాలు ఉంటే నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రోగికి సంబంధించి శస్త్రచికిత్స వివరాలు, కేస్‌ షీట్‌ నివేదికలను మూడేళ్ల వరకు భద్రపరిచేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో ఉన్న 39 స్కానింగ్‌ సెంటర్లను ప్రతినెలా తనిఖీ చేయాలన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతానని, ప్రభుత్వ నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప్రైవేటు ఆస్పత్రు ల అనుమతుల కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్‌ దేవ సహాయం, అడిషనల్‌ ఎస్పీ రామేశ్వర్‌, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, ప్రైవేటు ఆస్పత్రుల జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఇమ్యునైజేషన్‌ అధికారి రవికుమార్‌, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, బాలికా విద్యాభివృద్ధి అధికారిణి శోభారాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాస్‌ ఉన్నారు.

2,14,347 మందికి రూ.175.93 కోట్ల పెట్టుబడి సాయం

అన్నదాతలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సాగుకు ముందే రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తుందని.. ఈ పథకంతో జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 వానాకాలం సీజన్‌కు సంబంధించి బుధవారం నాటికి 2,14,347, మంది రైతుల ఖాతాల్లో రూ. 175,93,75,635 నిధులు జమ చేసినట్లు వివరించారు. మొత్తం 3,34,835 మంది రైతులకు రూ.429 కోట్ల పెట్టుబడి సాయం అందించనున్నట్లు వెల్లడించారు. రైతుల బ్యాంక్‌ ఖాతా వివరాలను ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుభరోసా పోర్టల్‌లో నమోదు చేశారన్నారు. వారం రోజుల్లో వ్యవసాయ భూమి కలిగిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6వేల చొప్పున చెల్లించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన వారు ఈ నెల 20వ తేదీలోగా రైతుభరోసా పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

డయాగ్నొస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లనిర్వహణలో పారదర్శకత పాటించాలి

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement