
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్గా నటించింది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడుతూ.. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేఫథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెచ్చింది చిత్రబృందం. తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక ఫన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రవితేజపై హీరోయిన్ శ్రీలీల ప్రశంసల వర్షం కురిపించింది.
ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు 'తూ మేరా లవర్' పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు. మాస్ జతారలో తాను సైన్స్ టీచర్గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు.
రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు. భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. వినోదం, మాస్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుందని తెలిపారు.