ఆట మొదలైంది! | Sports Backdrop Films in Tollywood | Sakshi
Sakshi News home page

ఆట మొదలైంది!

Dec 3 2025 12:19 AM | Updated on Dec 3 2025 12:19 AM

Sports Backdrop Films in Tollywood

స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు

సినిమా ఇండస్ట్రీలో స్పోర్ట్స్‌ జానర్‌ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు స్పోర్ట్స్‌ చిత్రాలు వస్తుంటాయి. ఈ చిత్రాల్లోని స్పోర్ట్స్, నటీనటుల ఎమోషన్స్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయితే చాలు... భాషతో కూడా పని లేకుండా సూపర్‌ హిట్‌ అయిన స్పోర్ట్స్‌ మూవీస్‌ చాలానే ఉన్నాయి. తాజాగా తెలుగులో కొన్ని స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాలు రూపొందుతున్నాయి. మరి.. ఏయే హీరోలు స్పోర్ట్స్‌కి సై అంటూ... బరిలోకి దిగి, ఆట మొదలుపెట్టారో ఓ లుక్‌ వేయండి.

క్రికెట్‌... కబడ్డీ 
ఏదైనా స్పోర్ట్స్‌ డ్రామా సినిమా వెండితెరపైకి వస్తే, ఆ సినిమాలో ఒక స్పోర్ట్‌ గురించిన ప్రస్తావనే ఉంటుంది. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆడియన్స్‌ మూడ్నాలుగు క్రీడలను చూడబోతున్నారు. అవును... రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ప్రధానంగా క్రికెట్‌ కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో కోకో, కబడ్డీ, కుస్తీ వంటి ఆటల ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌ను బట్టి ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్‌ క్రికెటర్‌గా కనిపిస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది.

మరి... మిగతా ఆటలతో రామ్‌చరణ్‌ పాత్ర ఏ విధంగా కనెక్ట్‌ అయ్యుంటుందనే విషయంపై వచ్చే ఏడాది మార్చిలో స్పష్టత రానుంది. మల్టీస్పోర్ట్స్‌ పీరియాడికల్‌ రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’లో రామ్‌చరణ్‌ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణను ప్లాన్‌ చేశారు. ‘దంగల్‌’ ఫేమ్‌ షామ్‌ కౌశల్‌ (బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తండ్రి) పర్యవేక్షణలో, నవనీత్‌ మాస్టర్‌ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కు కొరియోగ్రఫీ వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత, ‘పెద్ది’ టీమ్‌ ఢిల్లీకి వెళ్లనుందని తెలిసింది. ఢిల్లీలో ఓ పెద్ద క్రికెట్‌ మ్యాచ్‌ను షూట్‌ చేస్తారని సమాచారం. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో జరిగే ఓ లాంగ్‌ షెడ్యూల్‌తో ‘పెద్ది’ షూటింగ్‌ ఓ కొలిక్కి వస్తుందని తెలిసింది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

బైకర్‌ 
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ వారంలో అంటే... ఈ నెల 6న ‘బైకర్‌’ సినిమా థియేటర్స్‌కి వచ్చి ఉండేది. కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్‌ కాకూడదని, ఆడియన్స్‌కు నిజమైన స్పోర్ట్స్‌ సినిమా చూసిన మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని ‘బైకర్‌’ సినిమా టీమ్‌ తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసింది.  శర్వానంద్‌ హీరోగా నటించిన మోటో క్రాస్‌ రేసింగ్‌ ఫిల్మ్‌ ‘బైకర్‌’. ఈ చిత్రంలో శర్వానంద్‌ బైకర్‌గా నటించారు. ఈ సినిమా కోసం శర్వానంద్‌ తనను తాను కొత్తగా మలచుకున్నారు.

వెండితెరపై పర్‌ఫెక్ట్‌ బైకర్‌గా కనిపించేందుకు సరైన ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌తో బైకర్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గారు కూడా. ఈ సినిమాలోని బైక్‌ చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. అలాగే ‘బైకర్‌’ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ కావొచ్చు కానీ ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉన్నట్లుగా తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. 1990, 2000ల టైమ్‌ పీరియడ్‌లో ‘బైకర్‌’ సినిమా ఉంటుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో విక్రమ్‌ సమర్పణలో వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తొలిసారి స్పోర్ట్స్‌ డ్రామా 
దాదాపు ఐదేళ్ల క్రితం విజయ్‌ దేవరకొండ ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్‌) అనే ఓ బైక్‌ రేసింగ్‌ స్పోర్ట్స్‌ డ్రామా చేయాల్సింది. ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మ్యూజికల్‌ మూవీలో మాళవికా మోహనన్‌ హీరోయిన్‌. ఈ సినిమాకు ఆనంద్‌ అన్నామలై దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించాల్సింది. ఈ మూవీ ఓపెనింగ్‌ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌ నిలిచిపోయింది. అలా అప్పట్లో విజయ్‌ దేవరకొండ చేయాల్సిన స్పోర్ట్స్‌ మూవీ పట్టాలెక్కలేదు. కానీ ఐదేళ్లకు మళ్లీ విజయ్‌ దేవరకొండకు ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ కథ నచ్చిందట.

‘ఇష్క్, మనం, 24’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ ఓ స్పోర్ట్స్‌ డ్రామా కథను అనుకుంటున్నారట. ఈ కథను ఇటీవల విజయ్‌ దేవరకొండకు వినిపించగా, ఈ హీరో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలిసింది. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట విక్రమ్‌ కె. కుమార్‌. అయితే ప్రస్తుతం దర్శకుడు రవికిరణ్‌ కోలాతో విజయ్‌ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత రాహుల్‌ సంకృత్యాన్‌తో విజయ్‌ మరో సినిమా చేయాల్సి ఉంది. ఇలా... ‘రౌడీ జనార్ధన, రాహుల్‌ సంకృత్యాన్‌లతో విజయ్‌ చేయాల్సిన సినిమా షూటింగ్‌ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విక్రమ్‌ కె. కుమార్‌ సినిమాను విజయ్‌ టేకప్‌ చేస్తారని ఊహించవచ్చు. అయితే విజయ్‌ దేవరకొండకు విక్రమ్‌ కె. కుమార్‌ ఎలాంటి కథ  చెప్పారనే విషయంపై స్పష్టత లేదు. 

లబ్బరు పందు మేక్‌... 
క్రికెట్‌ నేపథ్యానికి లవ్‌ అండ్‌ ఫ్యామిలీ అంశాలను జోడించి తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘లబ్బరు పందు’. హరీష్‌ కల్యాణ్, దినేష్, శ్వాసిక, సంజన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సెప్టెంబరులో విడుదలై, సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో రీమేక్‌ అవుతున్నట్లుగా తెలిసింది. ఈ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్, రాజశేఖర్‌ కుమార్తె శివానీ రాజశేఖర్, రమ్యకృష్ణ, ‘35’ సినిమా ఫేమ్‌ విశ్వదేవ్, ప్రధాన తారాగణంగా నటిస్తున్నారని సమాచారం.

ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లుగా తెలిసింది. ఈ సినిమాలో రాజశేఖర్, విశ్వ తేజ్‌ క్రికెటర్లుగా కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరోవైపు దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత రాజశేఖర్, రమ్యకృష్ణ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుండం విశేషం.

థండర్‌ 
హీరో ఆది పినిశెట్టి ఫిట్‌నెస్, కటౌట్‌ ఓ స్పోర్ట్స్‌ డ్రామాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఆది పినిశెట్టి ‘థండర్‌’ అనే ఓ స్పోర్ట్స్‌ డ్రామా సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మూవీ కోసం ఆది కొత్తగా మేకోవర్‌ అయ్యారట. ఈ సినిమా గురించి త్వరలోనే మరికొన్ని కొత్త విషయాలను తెలియజేస్తానని ఆది పినిశెట్టి ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు.

మట్టి కుస్తీ సీక్వెల్‌ 
విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘గట్టా కుస్తీ’. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగు హీరో రవితేజ ఓ నిర్మాత. ఈ చిత్రం 2022లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులో ‘మట్టి కుస్తీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా సీక్వెల్‌ రూపొందుతోంది.

ఇటీవలే ‘మట్టి కుస్తీ 2’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తొలి భాగంలో నటించిన విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిలే మలి భాగంలోనూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే చెల్లా అయ్యావుయే సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వేల్స్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిలింస్‌తో కలిసి విష్ణు విశాల్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

మండాడి 
తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు హీరో సుహాస్‌ విలన్‌గా నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మండాడి’. ఈ యాక్షన్‌ స్పోర్ట్స్‌ డ్రామా సినిమాకు మదిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అయితే గత ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగింది. యూనిట్‌ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ, సామాగ్రి పాడైపోయింది. మరి... ఈ సినిమా నెక్ట్స్‌ అప్‌డేట్‌ గురించి మేకర్స్‌ మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఇటు క్రికెట్‌... అటు లవ్‌ 
‘సుడిగాలి’ సుధీర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జీఓఏటీ’. ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్‌గా నటించారు. మొగుళ్ళ చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమా కథ ప్రధానంగా క్రికెట్‌ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. కథనం క్రికెట్‌ నేపథ్యంలో సాగినా, లవ్‌ ట్రాక్, కామెడీ ట్రాక్‌లు కూడా ఉంటాయని సమాచారం. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, పృథ్వీ, ఆడుకులం నరైన్, ఆనంద రామరాజు, పమ్మి సాయి, చమ్మక్‌ చంద్ర, నవీన్‌ నేని ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు మణిశర్మ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

పతంగుల పోటీ 
ఇప్పటివరకూ ఎన్నో స్పోర్ట్స్‌ డ్రామా సినిమాలు చూసి ఉంటాం. కానీ గాలి పటాల పోటీ నేపథ్యంలో సినిమా వచ్చి ఉండదు. పతంగుల పోటీ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘పతంగ్‌’. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్, వంశీ పూజిత్‌ ప్రధాన తారాగణంగా, సింగర్‌ ఎస్పీ చరణ్‌ మరో కీలక పాత్రలో నటించిన సినిమా ‘పతంగ్‌’. ఈ కామెడీ స్పోర్ట్స్‌ మూవీకి ప్రణీత్‌ పత్తిపాటి దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌ 
కానుంది.

ఇంకా మరికొన్ని స్పోర్ట్స్‌ డ్రామా చిత్రాలు సెట్స్‌పై ఉండగా, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement