దర్శక శిఖరం భారతీరాజా మరణవార్త విని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నటి రాధికా శరత్కుమార్. ఆమెను హీరోయిన్గా పరిచయం చేసింది భారతీరాజానే. అందుకే అతన్ని గురువుగా భావించి, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనపై అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటుంది. బుధవారం భారతీరాజా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ రాధిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘నేను ఇలా ఉన్నానంటే కారణం ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు నా తల్లి, మరొకరు నా గురువుగారు భారతీరాజా. ఒక్క ఏడాదిలోనే నాకు ఇష్టమైన ఇద్దరినీ కోల్పోయాను. నా బాధను మాటల్లో వివరించలేకపోతున్నా. ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. హృదయం బరువెక్కింది. వారి జ్ఞాపకాలు, నాకు నేర్పిన జీవిత పాఠాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి’ అంటూ భారతీరాజాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు.
‘భారతీరాజా సర్.. మీరే నా సర్వసం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా, భారతీరాజాకు కూడా రాధికపై అపారమైన గౌరవం ఉండేది. తన విజయాల్లో రాధిక కూడా భాగమని చెప్పేవారు. ఇటీవల కూడా రాధిక ఆయన్ని కలవగా.. ఆమె నటించిన ‘తాయ్కిళవి’కి నేషనల్ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు.


