రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు కష్టాలు తొలగిపోలేదు. సమస్య మళ్లీ మొదటకొచ్చింది. అంతా సెట్ అయిందనుకున్న పర్సంటేజీ గొడవ మళ్లీ మొదలైంది. 'పెద్ది'కి కూడా పర్సంటేజీ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో శనివారం సమావేశమైన అనంతరం పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)
తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీతో రెండుమూడు సార్లు చర్చలు జరిగాయి. 'హరిహర వీరమల్లు' రిలీజ్ టైంలోనే 2-3 నెలల్లో సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. ఏడాది దాటిపోయినా అది జరగలేదు. నిర్మాతలు.. ముందుగా మూడు వారాలన్నారు. ఇప్పుడు మరో మూడు వారాలని వాయిదా వేస్తున్నారు. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలని థియేటర్లలో ఆడిస్తాం అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు.
దేశం మొత్తం థియేటర్లలో పర్సంటేజీ విధానం ఉంది. తెలంగాణలో మాత్రం రెంటల్ ఉంది. నిర్మాతలు.. సమస్యని రోజురోజుకీ ఆలస్యం చేస్తున్నారు. మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగడం లేదు. మాకు పర్సంటేజీ విధానం కావాల్సిందే. అది ఎంతిస్తారో చెప్పండి అని కూడా శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చు తెలంగాణలో మాత్రం ఉండదు. రేట్లు పెంచొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశాం. 'పెద్ది'పై మాకు ఎలాంటి పగ లేదు. కానీ ఇప్పుడు కాకపోతే నిర్మాతలు మళ్లీ ఎప్పుడు పట్టించుకుంటారనేది తెలియదు అందుకే ఈ చిత్రాన్ని కూడా పర్సంటేజీ శ్లాబ్లో చేర్చాలని ఫిక్సయ్యాం అని చెప్పుకొచ్చారు.
దీనిబట్టి చూస్తే ఆంధ్రా వరకు 'పెద్ది'కి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు గానీ తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేస్తారా అనేది సందేహం. ఎందుకంటే అటు నిర్మాతలు గానీ ఇటు ఎగ్జిబిటర్లు ఎవరూ తగ్గడం లేదు. విడుదలకు మరో 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో 'పెద్ది' విషయంలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్లా మారిపోయింది.
(ఇదీ చదవండి: వయసు తేడా ఏడాది.. తల్లీకొడుకుగా చేసిన హీరోహీరోయిన్)


