
ఇప్పుడు బాలీవుడ్కి టాలీవుడ్ సత్తా తెలిసివచ్చింది. ఒకనాటి హీరోల్లా ఏదో వచ్చాం అంటే వచ్చాం చేశాం అంటే చేశాం అన్నట్టు ఒకటీ అరా చేసి పోయే రకం కాదని, ఒకసారి కాలు పెడితే కార్చిచ్చులా వ్యాపించే నేటి తరం తెలుగు హీరోలను ఆపడం తమ తరం కాదని హిందీ బెల్ట్కి ఇప్పుడు బాగా అర్ధమవుతోంది.
నిజానికి బాలీవుడ్ కి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే శతకోటి ఇండస్ట్రీల్లో అదొకటి. తెలుగు ఫిలిం మేకర్స్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. దీన్ని మార్చాలని తామూ తక్కువేం కాదని నాటి సీనియర్ హీరోలు చాలా ప్రయత్నించారు. ఒకానొక దశలో అమితాబ్ను కూడా దాటేసి చిరంజీవి దేశంలోనే హైపెయిడ్ ఆర్టిస్ట్గా నిలిచి తన సత్తా చాటారు. అయినా ఇవేవీ బాలీవుడ్ బుర్రకెక్కలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు డైరెక్ట్ హిందీ చిత్రాల్లో నటించి అప్పుడప్పుడు అక్కడ మెరుపులు మెరిపించినా పెద్దగా ఒరిగింది అంటూ ఏమీ లేదు.
(చదవండి: సమంత డేటింగ్ రూమర్స్.. డైరెక్టర్ రాజ్ సతీమణి పోస్ట్ వైరల్!)
అదంతా ఒకెత్తయితే ‘బాహుబలి’ఒక్కటీ ఒకెత్తయింది. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లూ తనవైపు తలెత్తి చూసే రేంజ్ కు మన తెలుగు సినిమా ఎదిగింది. ఓ వైపు బాలీవుడ్లో ప్రభాస్(Prabhas) ప్రభంజనం కొనసాగుతుండగానే దూసుకొచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్(Ram Charan)లు, ‘పుష్ప’, ‘పుష్ప 2’ల తో అల్లు అర్జున్(Allu Arjun) కూడా నార్త్ లో బాలీవుడ్ హీరోలకు థీటుగా కలెక్షన్లు, ఫాలోయింగ్ను అందుకుంటూ ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని కుప్పకూల్చారు.
ఈ నేపధ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన మన హీరోల్లో అక్కడ అగ్రపీఠం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. ప్రస్తుతం వీరిలో ఎవరికి వారే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ... అందరిలో ప్రభాస్ కాస్త ముందున్నాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైట్, వెయిట్ సహా కటౌట్లో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ప్రభాస్ను నార్త్ జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అదే కారణం.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ టాలీవుడ్లో ఫ్లాప్ కాగా, అక్కడ సూపర్ హిట్ గా ‘ఆదిపురుష్’ కి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ‘సలార్’ ‘కల్కి’ లు బాక్సాఫీస్ను షేక్ చేసేశాయి. మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా విడుదలై ఎన్టీఆర్ , రాంచరణ్..ల సినిమాలకు నార్త్లో అంతగా కలెక్షన్స్ రాలేదు. హైప్ కూడా క్రియేట్ కాలేదు.
ఇక అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా కనపడింది కానీ.. అది తర్వాతి సినిమా వరకు ఎంత వరకూ కొనసాగుతుందనేది అప్పుడే ఏమీ చెప్పలేము. పుష్ప రాజ్ పాత్ర ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న స్థాయిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడా? అంటే అవునని అప్పుడే చెప్పడం సరికాదు.
ఈ నేపధ్యంలోనే ప్రభాస్ని ఢీ కొట్టడానికి మిగిలిన హీరోలు నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడి సినిమాల ద్వారా అక్కడకు వెళ్లడం కాకుండా..నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టారు. ‘వార్ 2’ లో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఆమిర్ ఖాన్ తీస్తున్న‘ ‘మహాభారతం’లో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాల ద్వారా ప్రభాస్ను ఎంత వరకూ దాటగలరో...బాలీవుడ్లో సౌతిండియా సూపర్స్టార్ ఎవరు కానున్నారో..