ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి(AA 22) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. పుష్ప-2 తర్వాత బాలీవుడ్లో అల్లు అర్జున్కు భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో తను నటించబోయే సినిమాల్లో హిందీ హీరోయిన్లనే ఎంపిక చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే అట్లీ సినిమా కోసం దీపికా పదుకోణ్ను తీసుకున్నారు. లోకేశ్ కనగరాజ్ మూవీ కోసం శ్రద్ధా కపూర్ పేరు పరిశీలనలో ఉంది. ఇంతలోనే మరో క్రేజ్ హీరోయిన్ పేరు తెరపైకి రావడం విశేషం.
అల్లు అర్జున్- అట్లీ మూవీ కోసం అనుష్క శర్మను తీసుకోనున్నట్లు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. కానీ, ఈ వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే, అనుష్క ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయనున్నారు. క్రికెటర్ కోహ్లీతో వివాహం తర్వాత అనుష్క కాస్త సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అర్జున్తో సినిమా కావడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

AA22 చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సైన్స్ఫిక్షన్ మూవీలో హీరో పాత్ర మూడు విభిన్న కోణాల్లో సాగుతుందని టాక్. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణ్తో పాటు అనుష్క శర్మ ఎంట్రీ ఇస్తే ఇదో సంచలనంగా మారడం ఖాయం.


